
మణిపూర్ లో చెలరేగిన హింసాకాండలో ఓ సివిల్ సర్వీ స్ ఆఫీసర్ మరణించారు. ఇంఫాల్ లో విధులు నిర్వహిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారి మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్ ) అసోసియేషన్ తెలియజేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టింది.
‘‘ఇంఫాల్ లో ట్యాక్స్ అసిస్టెంట్ శ్రీ లెట్మింతంగ్ హావోకిప్ మరణానికి కారణమైన హింసాకాండను అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఒక అమాయక ప్రభుత్వ ఉద్యోగిని చంపడాన్ని భావజాలం సమర్థించదు. ఈ క్లిష్ట సమయంలో మేమంతా ఆయన కుటుంబానికి మద్దతుగా ఉన్నాము.’’ అని ఆయన ఫొటోను కూడా ఐఆర్ఎస్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.
కాగా.. గత 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రక్తసిక్తమైన జాతి అల్లర్లు జరిగాయని, మొత్తం 13,000 మందిని రక్షించి సురక్షిత షెల్టర్లకు తరలించామని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. భద్రతా దళాల జోక్యంతో మణిపూర్ లో పరిస్థితి మెరుగుపడిందని డీజీపీ పీ డౌంగెల్ తెలిపారు.
చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?
ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో చెలరేగిన అంతర్-కమ్యూనిటీ ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు మణిపూర్ ప్రభుత్వం ఇండియన్ ఆర్మీని, అస్సాం రైఫిల్స్ ను సాయం చేయాలని కోరింది. దీంతో భద్రతా బలగాలు సానూకూలంగా స్పందించాయి. వేగంగా రాష్ట్ర మొత్తం వ్యాపించాయి. ఫలితంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. ‘‘చురుకైన, వేగవంతమైన స్పందన ఫలితంగా చురాచంద్పూర్, కేపీఐ, మోరే, కక్చింగ్ ప్రాంతంలో పరిస్థితితులు నియంత్రణలో ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి పెద్దగా హింస లేదు’’ అని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. భాగస్వాములందరూ సమన్వయంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పేర్కొంది. కాగా.. అస్సాంలోని రెండు వైమానిక స్థావరాల నుంచి సీ17 గ్లోబ్ మాస్టర్, ఏఎన్ 32 విమానాలతో ఐఏఎఫ్ నిరంతరం గాలింపు చేపట్టింది.
ఈ అల్లర్లలోనే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రెండు రోజుల కింద మూకదాడికి గురయ్యారు. ఇంఫాల్ లో బీజేపీ నేత వుంగ్జాగిన్ వాల్టేపై ఓ గుంపు దాడి చేసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఇంఫాల్ రిమ్స్ కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ను కలిసిన అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి తిరిగి వస్తుండగా ఇంఫాల్ లో ఓ గుంపు దాడి చేసింది. ఆయన ఫెర్జాల్ జిల్లా థాన్లాన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన అధికారిక నివాసానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.