తాలిబాన్ల దగ్గరకెళ్లండి.. పెట్రోల్ చౌకగా లభిస్తుంది: జర్నిలిస్టుపై ఎంపీ నేత ఫైర్

By telugu teamFirst Published Aug 20, 2021, 1:01 PM IST
Highlights

పెట్రోల్ ధరలు పెరగడాన్ని ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ నేత మండిపడ్డారు. ‘తక్కువ ధరకే పెట్రోల్ కావాలా? అయితే, తాలిబాన్లదగ్గరకెళ్లండి. అక్కడ చౌకగా లభిస్తుంది’ అంటూ ఆగ్రహించారు.

భోపాల్: ప్రపంచమంతా ఇప్పుడు తాలిబాన్ల అరాచకాలవైపే చూస్తున్నది. వారి పాలన ఎలా ఉండబోతుందన్న ఆందోళనల్లో ఉన్నది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధర పెరుగుదలను ప్రశ్నించిన ఓ పాత్రికేయుడిపై మధ్యప్రదేశ్ నేత మండిపడ్డారు. ‘తాలిబాన్ల దగ్గరకెళ్లండి. అక్కడ పెట్రోల్ రూ. 50కే అమ్ముతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి పెట్రోల్ నింపుకోండి. అక్కడ పెట్రోల్ నింపుకోవడానికి ఎవరూ లేరంటా’ అని ఆగ్రహించారు. 

కాత్ని జిల్లా బీజేపీ యూనిట్ చీఫ్ రామ్‌రతన్ పాయల్ ఈ కామెంట్స్ చేశారు. ఒకవైపు కరోనావైరస్ మూడో వేవ్ ముప్పు ఉండగా పెట్రోల్ ధరలపై అడగడాన్ని ఆయన తప్పుబట్టారు. కనీసం ఇండియాలో సేఫ్టీ ఉన్నదని, ఆఫ్ఘనిస్తాన్‌లో అదీ లేదని వివరించారు. ఇప్పటికే కరోనా వైరస్ రెండు వేవ్‌లను ఎదుర్కొన్నదని, మరో వేవ్ వచ్చే అవకాశముందని తెలిపారు.

‘మీరొక పేరున్న జర్నలిస్టు. దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకైనా అర్థమవుతున్నదా? నరేంద్ర మోడీ పరిస్థితులను ఎలా కంట్రోల్ చేస్తున్నారా తెలుస్తున్నదా? ఆయన ఇప్పటికీ 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నారు’ అంటూ వివరించారు.

click me!