3 వేల గంటలు, 15 వందల ట్రిప్పులు, 20 లక్షల కి.మీ ప్రయాణం: కోవిడ్‌పై పోరులో వాయుసేన నిబద్ధత

By Siva KodatiFirst Published May 27, 2021, 3:27 PM IST
Highlights

దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో భారత వాయు సేన చర్యలు ప్రశంసనీయం. ప్రపంచం చుట్టూ 55 సార్లు ప్రదక్షిణలు చేసినంత దూరం ప్రయాణించి, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతోంది

దేశ సరిహద్దుల్లో రక్షణతో పాటు విపత్కర పరిస్థితుల్లో దేశానికి అండగా నిలుస్తున్నాయి త్రివిధ దళాలు. వర్షాలు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో రక్షణ చర్యలు చేపట్టి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చరిత్ర మన సాయుధ దళాల సొంతం. తాజాగా దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో భారత వాయు సేన చర్యలు ప్రశంసనీయం. ప్రపంచం చుట్టూ 55 సార్లు ప్రదక్షిణలు చేసినంత దూరం ప్రయాణించి, నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమవుతోంది. ఆక్సిజన్ దగ్గర నుంచి వైద్య పరికరాల వరకు వాయుసేన విమానాలు భారత్‌కు మోసుకొస్తున్నాయి. 

గడచిన ఒకటిన్నర నెలల కాలంలో ఐఏఎఫ్ విమానాలు దాదాపు 3,000 గంటలపాటు 1,500కు పైగా ట్రిప్పులు ప్రయాణించాయి. సుమారు 20 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. అంటే ప్రపంచం చుట్టూ 55 ప్రదక్షిణలు చేసినట్లే. విదేశాల నుంచి తీసుకొచ్చిన వాటిని ఢిల్లీలోని పాలం వైమానిక స్థావరంలో ఉంచి, ఆ తర్వాత మన దేశంలో అవసరమైన చోటుకు తరలిస్తున్నారు. ముఖ్యంగా సీ-17 విమానం దాదాపు 35 గంటలు ప్రయాణించి బ్రిటన్ నుంచి చెన్నైకి 37 టన్నుల ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చింది. 

Also Read:పేదలకు అండగా ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

దీనిపై ఎయిర్ మార్షల్ ఎం రనడే మాట్లాడుతూ, తమకు ఏ పని అప్పగించినా ఉద్యమ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహాయం ఎక్కడ అవసరమైతే అక్కడికి తీసుకెళ్ళి, అందజేయడం కోసం అందుబాటులో ఉన్న వనరులను సమగ్రంగా సద్వినియోగం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. తాము పొందిన శిక్షణకు ప్రతిఫలాన్ని తిరిగి దేశానికి ఇచ్చే అవకాశం కోసం తాము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పారు.  చిట్ట చివరి వ్యక్తి సైతం కోవిడ్ నుంచి విముక్తి పొందే వరకు తమ కృషి కొనసాగుతుందని చెప్పారు. 

click me!