
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్షా సోమవారంనాడు లోక్సభలో తనపై తానే సెటైర్ వేసుకుంటూ.. నవ్వులు పూయించారు. తన స్వరం గంభీరంగా ఉంటుందని, గట్టిగా మాట్లాడానంటే.. కోపంగా ఉన్నట్టు కాదని, కశ్మీర్కు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు మినహా తనకెప్పుడూ కోపం రాదని అమిత్షా అన్నారు. నేనెప్పుడూ ఎవరినీ తిట్టలేదనీ, తన స్వరం కొంచెం ఎత్తుగా ఉందనీ.. అది తయారీ లోపమని అనగానే.. సభలో ఒక్క సారిగా నవ్వులు వెల్లివిరిసాయి.
పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల చివరి వారంలో భాగంగా ''క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ 2022''ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే ఆయన తన గొంతుపై సెటైర్ వేసుకున్నారు. నేర పరిశోధనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా చేయడం, నేరారోపణ రేటును పెంచడం క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేష్ బిల్లు లక్ష్యం అని అమిత్ షా అన్నారు. ఈ బిల్లు ఇప్పటికే చాలా ఆలస్యమైందని అన్నారు.
గోప్యత హక్కుతో సహా బిల్లుపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనను తగ్గించాలని కేంద్ర హోంమంత్రి ప్రయత్నించారు. ప్రతిపక్ష బెంచ్లు కొన్ని వ్యాఖ్యలు చేయడంతో, అమిత్ షా “దాదా” చెప్పిన పాయింట్పై స్పందిస్తానని అన్నారు. 1980లో ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1920ని పునఃపరిశీలించాలని లా కమిషన్ తన నివేదికలో భారత ప్రభుత్వానికి ప్రతిపాదన చేసిందని ఆయన చెప్పారు. సమయం వచ్చినప్పుడల్లా దానిపై చర్చ జరుగుతూనే ఉందన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రాలతో తాము సంప్రదింపులు జరిపామని, వారి అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు.
ఈ బిల్లులో వేలి ముద్రలు, అరచేతి-ముద్ర, పాదముద్ర ముద్రలు, ఛాయాచిత్రాలు, ఐరిస్, రెటీనా స్కాన్, భౌతిక, జీవ నమూనాలు, వాటిపై విశ్లేషణాత్మక నిర్వచించాలని బిల్లు ప్రయత్నిస్తుంది. ఇది సాక్ష్యాధారాల రికార్డును సేకరించడానికి, నిల్వ చేయడానికి, భద్రపరచడానికి, రికార్డులను భాగస్వామ్యం చేయడానికి, వ్యాప్తి చేయడానికి, నాశనం చేయడానికి, పారవేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి అధికారం కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ బిల్లు ఏ వ్యక్తినైనా తన ఆధారాలను, ముద్రలను ఇవ్వమని ఆదేశించేలా మేజిస్ట్రేట్కు అధికారం ఇవ్వాలని, ప్రతిఘటించే లేదా కొలతలు ఇవ్వడానికి నిరాకరించిన ఏ వ్యక్తినైనా కొలతలు తీసుకునేందుకు పోలీసు లేదా జైలు అధికారికి అధికారం కల్పించాలని కోరింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రిమినల్ చట్టాలు, నేర నిర్ధారణ ప్రక్రియలో వినియోగిస్తున్న పలు ప్రొవిజన్లను అధ్యయనం చేశామని మంత్రి తెలిపారు. పలువురు పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తారని ఆయన చెప్పారు. అన్నింటినీ క్రోడీకరించి ఈ బిల్లు తెచ్చినట్టు సభకు అమిత్షా తెలిపారు.