
బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) వార్షిక బడ్జెట్ కాపీలను మార్చి 31వ తేదీన విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది గంటల ముందు ఇందుకు సంబంధించి ప్రతులను ప్రజల ముందుంచారు. బడ్జెట్లో ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ. 10,484 కోట్లుగా, మొత్తం వ్యయం రూ. 10,480 కోట్లుగా అంచనా వేయబడింది. అంచనాల ప్రకారం వ్యయంలో దాదాపు 46 శాతం (రూ. 4,838.26 కోట్లు) పబ్లిక్ వర్క్స్ కోసం, 30 శాతం (రూ. 3,148.12 కోట్లు) నిర్వహణ కోసం, 12 శాతం (రూ. 1,234.72 కోట్లు) సిబ్బంది ఖర్చుల కోసం కేటాయించారు.
బడ్జెట్లో ఆస్తిపన్ను వసూలుపై ప్రధానంగా దృష్టి సారించారు. ఆస్తిపన్ను ద్వారా కనీసం రూ. 1,500 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయిచారు. ఆస్తిపన్ను తక్కువగా చెల్లించే వారిపై జరిమానాలు కూడా విధించనున్నట్లు పేర్కొన్నారు. ఇది BBMPకి బకాయిపడిన దీర్ఘకాలిక బకాయిలను వసూలు చేయడంలో కూడా వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.
అయితే బీబీఎంపీ మార్చి 31న.. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్ని గంటల ముందు బడ్జెట్ను విడుదల చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నగర అభివృద్దికి బీబీఎంపీ మెరుగైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నమ్మ బెంగళూరు ఫౌండేషన్ జనరల్ మేనేజర్ వినోద్ జాకబ్ మాట్లాడుతూ.. ‘కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి కొన్ని గంటల ముందు BBMP బడ్జెట్ కాపీలను విడుదల చేసింది. BBMP చట్టంలోని సెక్షన్ 196 ప్రకారం.. స్థానిక సంస్థల బడ్జెట్ను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి కనీసం మూడు వారాల ముందు ప్రకటించాలి.
బెంగుళూరు రాష్ట్ర రాజధాని.. అంతేకాకుండా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. నగర బడ్జెట్ను మరింత ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. బీబీఎంపీ మెరుగైన ప్రణాళిక, బడ్జెట్లను తీసుకురావడంలో పాలుపంచుకోవాలి. నగరానికి ఇబ్బందికరంగా ఉన్న ప్రధాన సమస్యలైన రోడ్లు, పార్కులు, చెత్త, మురుగు నీటి కాలువలు, వరదలు, సరస్సులు, మరుగుదొడ్లు వంటి వివిధ సమస్యలపై దృష్టి సారించడం.. పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యమైనది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్పై ఖర్చు ఎల్లప్పుడూ భారీగానే ఉంటుంది.. కానీ నగరంలో మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో మెరుగుపడటం లేదు’ అని చెప్పారు.
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ గురించి..
Namma Bengaluru Foundation అనేది బెంగళూరు, అక్కడి పౌరులతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని పౌరుల హక్కులను రక్షించడానికి పని చేస్తున్న ఒక ఎన్జీవో. ఇది మెరుగైన బెంగళూరు కోసం పనిచేస్తుంది. నగరం యొక్క ప్రణాళిక, పాలనలో పౌరులు పాల్గొనేందుకు, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి, ప్రజా ధనం, ప్రభుత్వ ఆస్తులకు జవాబుదారీతనం ఉండేలా ఈ ఫౌండేషన్ ఒక వేదికగా పనిచేస్తుంది.