
తిరువనంతపురం: కర్ణాటకలో వెలుగుచూసిన హిజాబ్ వివాదం(Hijab Controversy) ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా, ఈ విషయంపై కేరళ గవర్నర్(Keral Governor) ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్(Arif Mohammad Khan) మాట్లాడారు. ఆయన ఏషియానెట్ న్యూస్తో సోమవారం ప్రత్యేకంగా మాట్లాడారు. హిజాబ్ వివాదం మొదలు.. యూనిఫామ్ సివిల్ కోడ్ వరకూ చాలా అంశాలను ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లే అమ్మాయిలతో మతానికి ముప్పు ఉన్నదనే ఆలోచనల్లోనే హిజాబ్ వివాదం మూలాలు ఉన్నాయని వివరించారు.
హిజాబ్ ధరించడం మూలంగా రేగిన వివాదం అనవసరం అయినది అని ఆయన పేర్కొన్నారు. దీనికి వెనుక ఒక కుట్ర ఉన్నదని వివరించారు. మన దేశంలోని నవతరం అమ్మాయిలు విద్యలో రాణిస్తున్నారని చెప్పారు. యూనివర్సిటీ, కాలేజీల్లో వారు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో ముస్లిం మతానికి చెందిన అమ్మాయిలు కూడా ఉన్నారని వివరించారు. ఇక్కడే కుట్ర మూలాలు వేళ్లూనుకుని ఉన్నాయని తెలిపారు.
"
ముస్లిం మతంలో ఓ చిన్న సమూహం త్రిపుల్ తలాఖ్ కొనసాగాలని భావించేది ఉన్నదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. ఈ గుంపులోని వారే ముస్లిం అమ్మాయిలు కాలేజీల్లో, యూనివర్సిటీల్లో రాణిస్తున్నారని తెలియగానే కొంత అసహనానికి గురయ్యారని వివరించారు. ఆ అమ్మాయిల్లోని చైతన్యాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని, అది ఒక రకంగా మతానికి ముప్పుగానే ఆ కొందరు భావిస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సింధు సూర్యకుమార్కు తెలిపారు.
అదిగో.. ఆ సెక్షన్ వాళ్లే.. ఈ హిజాబ్ వివాదం ద్వారా ముస్లిం అమ్మాయిలను కాలేజీలు, యూనివర్సిటీలకు దూరం చేయాలనే కుట్ర పన్నారని కేరళ గవర్నర్ తెలిపారు. ఒక వేళ వారు హిజాబ్ ధరించి కూడా తమ చదువును కొనసాగించినా.. వారి కెరీర్ ఎంతో ఉన్నతంగా ఎదగకుండా జాగ్రత్త పడేవారని పేర్కొన్నారు. వారిని ఇంటికే పరిమితం చేయాలనే కుట్రనే ఇది అని వివరించారు.
అలాగే, ఈ అనవసర వివాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. పిల్లలు తమ చదువులపై ఫోకస్ పెట్టాలని సూచనలు చేయాలని వివరించారు. ఈ కమ్యూనిటీ పురోగతికి, అదే విధంగా దేశ అభివృద్ధికీ మంచి విద్యనే దోహదపడుతుందని తెలిపారు. మంచి విద్యను పొందడమే కాదు.. దేశానికి సేవలు అందించడం ద్వారా కూడా ఇది సాధ్యపడుతుందని చెప్పారు.
ఇదిలా ఉండగా, కర్ణాటకలో శివమొగ్గలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిజాబ్ తొలగించి.. పరీక్షలకు హాజరుకావడానికి పలువురు ముస్లిం విద్యార్థులు నిరాకరించారు. ఈ క్రమంలోనే పరీక్షలను బహిష్కరించారు. వివరాల్లోకెళ్తే.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో కర్నాటకలో మూతపడిన విద్యాసంస్థలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే అత్యధిక ముస్లిం విద్యార్థులు హిజాబ్ ధరించకుండా తరగతులకు హాజరైనప్పటికీ, శివమొగ్గ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఎస్ఎస్ఎల్సీ (10వ తరగతి) ప్రిపరేటరీ పరీక్షకు హిజాబ్ తొలగించి.. హాజరు కావడానికి నిరాకరించారు. పరీక్షలను బహిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ హిజాబ్ వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.