దొంగతనానికి వచ్చేప్పుడు పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ధరించి వస్తున్నారు. తమ ప్రాణ రక్షణ కోసం.. తమకు వైరస్ సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్ ధరించి.. ఆ తర్వాత దొంగతనం చేయడం గమనార్హం.
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఎవరికి, ఎక్కడ, ఎలా కరోనా వైరస్ సోకుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా మందికి వైరస్ సోకుతోంది. దీంతో.. బయట అడుగుపెట్టాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు.
ప్రజలంతా ఈ వైరస్ బారిన పడకుండా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. దొంగతనానికి వచ్చేప్పుడు పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లు ధరించి వస్తున్నారు. తమ ప్రాణ రక్షణ కోసం.. తమకు వైరస్ సోకకుండా ఉండేందుకు పీపీఈ కిట్ ధరించి.. ఆ తర్వాత దొంగతనం చేయడం గమనార్హం. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహరాష్ట్రలోని సతారా డిస్ట్రిక్ట్లోని ఓ జ్యూవెలరీ స్టోర్లో ఇటీవల ఓ దొంగతనం జరిగింది. ఈ షాపును దోచుకున్న దొంగలు 780గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సీసీటీవీ కెమెరాలో ఈ తతంగం మొత్తం రికార్డయింది. ఈ రికార్డును పరిశీలించిన పోలీసులు షాకయ్యారు. ఎందుకంటే ఆ వీడియోలో దొంగలు పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. గ్లవ్స్, ప్లాస్టిక్ కోట్స్, హెల్మెట్స్ ధరించి పూర్తి సన్నద్ధతతో వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.