
Heavy Rain In Maharashtra: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి ప్రాంతంలో బుధవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరిని రక్షించినట్లు పాల్ఘర్ జిల్లా కలెక్టర్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం పాల్ఘర్ జిల్లాలోని వాసాయి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంఘటన నమోదైందని తెలిపారు.
సోమవారం, భారత వాతావరణ శాఖ జూలై 14 వరకు పాల్ఘర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే భారీగా కురుస్తున్న వానల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. భారత వాతావరణ విభాగ వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో జూలై 14 వరకు వివిక్త/చెదురుమదురు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 45-55 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఈ సమయంలో సముద్రాల్లోకి వెళ్లవద్దని సూచించారు. రాష్ట్రంలోని పలు నదులు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కుండలికా నది హెచ్చరిక స్థాయిని దాటడంతో అంబా, సావిత్రి, పాతాళగంగ, ఉల్హాస్, గర్హి నదుల నీటిమట్టం హెచ్చరిక స్థాయి కంటే కాస్త తక్కువగా ఉంది.
భారీ వర్షలతో 89 మంది మృతి
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్సాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 89 కి పెరిగిందని అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాలను వరదల ముంచెత్తాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
తెలంగాణలోనూ దంచికొడుతున్న వానలు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, వరదలు బుధవారం తెలంగాణలోని చాలా ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాయి. అనేక గ్రామాలు, కొన్ని పట్టణాలు పొంగిపొర్లుతున్న నీటి వనరులతో ముంపునకు గురయ్యాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం వర్షాకాలం ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లపై నీరు ప్రవహించడంతో మారుమూల గ్రామాలకు సంబంధాలు తెగిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల జిల్లాల్లోని కొన్ని పట్టణాల్లోని గ్రామాలు, కొన్ని ప్రాంతాలు జలమయం కావడంతో వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వచ్చింది. రాష్ట్రంలోని అనేక జలాశయాలు నీటిమట్టాలు పెరుతుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంటూ.. అధికారులను అప్రమత్తం చేసింది.