
Hijab row-Supreme Court: హిజాబ్ నిషేధానికి సంబంధించి కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. కర్నాటక హైకోర్టు మార్చి 15న హిజాబ్లు ధరించడం ఇస్లాం ముఖ్యమైన ఆచారం కిందకు రాదని తీర్పునిచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్న తర్వాత ఈ అంశాన్ని వచ్చే వారం తగిన బెంచ్ ముందు జాబితా చేయడానికి అంగీకరించింది. ఈ విషయాలను మార్చిలో దాఖలు చేశామని, అయితే ఇంకా జాబితా చేయలేదని ప్రశాంత్ భూషణ్ చెప్పారు.
హిజాబ్ వివాదం కేసు వివరాలు ఇవే..
ఈ ఏడాది జనవరిలో కర్నాటకలోని ఉడిపిలోని పాఠశాల తరగతి గదుల్లో హిజాబ్ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఒక్క కర్నాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు సైతం ఈ వివాదం వ్యాపించింది. దీంతో బాలికలు కర్నాటక హైకోర్టులో ఈ ఉత్తర్వులను సవాలు చేశారు. ఫిబ్రవరి 25న ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు.. ఆ తర్వాత హిజాబ్ నిషేధంపై తీర్పు వెల్లడించిన తర్వాత.. నిరసనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తాయి.
మార్చి 15న, కర్ణాటక హైకోర్టు హిజాబ్లు ధరించడం ఇస్లాంలో ముఖ్యమైన అభ్యాసం కిందకు రాదని తీర్పు చెప్పింది. కర్నాటక పాఠశాలల్లో హిజాబ్పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసిన కర్నాటక హైకోర్టు యూనిఫాం ధరించడంపై ఆంక్షలు సహేతుకమైనవని, విద్యార్థులు దీనిని వ్యతిరేకించలేరని తీర్పునిచ్చింది. అనంతరం హైకోర్టు తీర్పుపై కర్నాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తీర్పును ఉడిపికి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ముస్లిం విద్యార్థి నిబా నాజ్ తరపున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని కర్నాటక విద్యా చట్టంలో పేర్కొనలేదని, హిజాబ్ ధరించే హక్కు గోప్యత హక్కు పరిధిలోకి వస్తుందని హైకోర్టు గుర్తించడంలో విఫలమైందని పిటిషనర్లు సమర్పించారు.
హిజాబ్ వివాదానికి కారణాలు ఇలా ఉన్నాయి..
ఉడిపిలో ఈ వివాదం రాజుకుంది. అక్కడి ఒక పాఠశాలలో విద్యార్థులు హిజాబ్ లు ధరించి తరగతులకు హాజరుకావడంపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారి తీరును వ్యతిరేకిస్తూ.. కాషాయ కండువాలు ధరించారు. ఈ క్రమంలోనే హిజాబ్-కాషాయ కండువాల వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే కాషాయ కండువాలు, హిజాబ్ లు ధరించి పాఠశాలకు రావద్దని యాజమాన్యం చర్యలు తీసుకుంది. అయితే, దీనిపై హిజాబ్ ధరించిన బాలికలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలు సైతం యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొద్ది రోజుల్లోనే ఈ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. ఈ క్రమంలోనే హిజాబ్ ధరించిన బాలికలు కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే, న్యాయస్థానం వారి వాదనలు తోసిపుచ్చింది. హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా తీర్పును ఇచ్చింది. దీంతో పలువురు హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వచ్చే వారం ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది.