
Schools closed : దేశంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరదల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజా ఇబ్బందులు పెరిగాయి. ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని లక్నో, నోయిడా, కాన్పూర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల నేపథ్యంలో పాఠశాలలను సోమవారం మూసివేయనున్నారని అధికార వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా, లక్నో, నోయిడా, కాన్పూర్, అలీఘర్, మీరట్, ఆగ్రా, హాపూర్లోని పలు జిల్లాల్లోని పాఠశాలలు సోమవారం (అక్టోబర్ 10న) మూసివేయబడతాయి. పాఠశాలలు మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కోరారు.
శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రోజంతా భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భారీ వర్షం కారణంగా నోయిడాలోని పాఠశాలలు సోమవారం మూసివేయబడతాయని స్థానిక అధికార యంత్రాంగం ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ రాజధాని ప్రాంతమైన ఎన్సీఆర్ పరిధిలో శనివారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లను వరదలు ముంచెత్తాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లను నేలకూలాయి. ముఖ్యంగా ఫ్లై ఓవర్ల కింద చాలా రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఇతర జిల్లాలైన లక్నో, కాన్పూర్, అలీఘర్, మీరట్, ఆగ్రా, హాపూర్లలోని పాఠశాలలు కూడా సోమవారం మూసివేయబడతాయి. యూపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో సోమవారం (10న) మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. "జిల్లాలో కురుస్తున్న అధిక వర్షం కారణంగా.. అధిక వర్షం కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, గౌతమ్ బుద్ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ అన్ని బోర్డుల ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్ ఎయిడెడ్-అన్ ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలలకు అక్టోబర్ 10 (సోమవారం) సెలవు ప్రకటించారు. జిల్లాలో 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇది వర్తిస్తుందని" జిల్లా పాఠశాల ఇన్స్పెక్టర్ ధరమ్వీర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఢిల్లీలో భవనం కూలి ముగ్గురు మృతి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య ఢిల్లీలో భవనం కూలిపోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు భవన శిథిలాల కింద చిక్కుకున్నారు. వర్షం పడుతుండగా రాత్రి 7:30 గంటలకు సంఘటన గురించి తమకు సమాచారం వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. వివరాల్లోకెళ్తే..ఢిల్లీలోని లాహోరీ గేట్లో భవనం కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా, నలుగురు అక్కడే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న భవనానికి ఐదు అగ్నిమాపక వాహనాలను పంపించారు. అలాగే, విపత్తు సహాయక బృందాలు సైతం అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్ల కింద వరదలు ముంచెత్తుతున్న రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు.