టీచర్ కాదు కీచకుడు: బాలిక బుగ్గ కొరికిన హెడ్‌మాస్టర్.. పోలీసుల ముందే చితకబాదిన జనం

By Siva KodatiFirst Published Sep 19, 2021, 2:29 PM IST
Highlights

నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బీహార్‌లో కలకలం రేపింది. ఆ కీచకుడు బాధిత విద్యార్థిని చెంపను కొరికాడు. అయితే బాలిక భయంతో కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆ హెడ్ మాస్టర్‌ను స్కూల్ గదిలో బంధించారు

ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. పొలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా పసిబిడ్డల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవ్వరినీ  వదలడం లేదు. ఇటీవలి గణాంకాల ప్రకారం.. బయటి వ్యక్తుల కన్నా తెలిసిన వారు, పరిచయస్తుల చేతుల్లోనే మగువలు అత్యాచారానికి గురవుతున్నట్లు వెల్లడించింది. తాజాగా విద్యాబుద్ధులు చెప్పి.. విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే .. విద్యార్ధినులను చెరబడుతున్నారు.

ఈ క్రమంలో నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బీహార్‌లో కలకలం రేపింది. ఆ కీచకుడు బాధిత విద్యార్థిని చెంపను కొరికాడు. అయితే బాలిక భయంతో కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆ హెడ్ మాస్టర్‌ను స్కూల్ గదిలో బంధించారు. ఈ ఘటన కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో పాటు స్కూలు వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.. హెడ్ మాస్టర్‌ను బయటకు లాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం నుంచి ప్రధానోపాధ్యాయుడిని కాపాడడం పోలీసులకు సైతం కష్టతరమైపోయింది. ఎలాగోలా వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఘటన జరిగినప్పుడు అసలేం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన బుర్ర పనిచేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. మరోవైపు హెడ్ మాస్టర్‌ను చితకబాదిన వీడియోలు వైరల్ కావడంతో.. కటిహార్ ఏఎస్పీ రష్మి స్పందించారు. ఆ వీడియోలు ఇంకా తన దృష్టికి రాలేదని, ఒకవేళ అదే నిజమైతే దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 
 

click me!