
Guru Ravidas Jayanti: ఫిబ్రవరి 16, బుధవారం దేశవ్యాప్తంగా గురు రవిదాస్ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం రవిదాస్ 645వ జయంతి. రవిదాస్ జయంతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రవిదాస్ జయంతి కారణంగా ఎన్నికల సంఘం ఈ నెల ప్రారంభంలో పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీని ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ప్రజలు ఎంతగానో అభిమానించే.. ప్రేమించే.. ఈ గురు రవిదాస్ ఎవరు? ఆయన ఏం చేశారు? ఆయన జీవిత చరిత్ర వంటి పలు విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సిద్ధయోగి, భక్తి ఉద్యమ మనికిరీటి, జాతి విశిష్టతను, ఔచిత్వాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, సామాజిక సమరసతా మూర్తి గురు రవిదాస్. నేడు యావత్ భారతం ఆయన జయంతిని ఘనంగా జరుపుకుంటోంది. గురు రవిదాస్ మాఘ పూర్ణిమ (మాఘమాసంలో పౌర్ణమి రోజు) నాడు జన్మించారు, అందుకే మాఘ పూర్ణిమ నాడు హిందూ క్యాలెండర్ ప్రకారం ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని మాండూడిహ్ (Manduadih)లో 1377 CE ( 1377 C.E.)లో జన్మించిన గురు రవిదాస్.. భక్తి ఉద్యమం సమయంలో భక్తిగీతాలు, శ్లోకాలు, ఆధ్యాత్మిక బోధనల రూపంలో విశేషమైన కృషి చేసిన భారతీయ ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మిక గురువు. అతను సిక్కు మతం పవిత్ర గ్రంథం అయిన ఆది గ్రంథం (Adi Granth) లో 40 పద్యాలను కూడా రాశాడు.
కులతత్వపు అడ్డుగోడలకు వ్యతిరేకంగా, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పరితపించిన మహనీయుడు సంత్ రవిదాస్. సిద్ధయోగి, భక్తి ఉద్యమ మనికిరీటి, జాతి విశిష్టతను, ఔచిత్వాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, సామాజిక సమరసతా మూర్తిగా ఆయన పేరుగాంచారు. ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ.. దానిని నిర్మూలించడానికి కృషి చేశారు. మత సామరస్యాన్ని, ఆధ్యాత్మిక స్వేచ్ఛను ప్రోత్సహించాడు. అందికి సమానత్వాన్ని సమర్థించాడు. గురు రవిదాస్ జనమ్ ఆస్థాన్ అనేది ఆయన జన్మస్థలానికి పెట్టబడిన పేరు. అతని జన్మస్థలం అతని అనుచరులందరికీ ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అతను మీరా బాయికి ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా.
గురు రవిదాస్ తన కాలంలో భారీ ఫాలోయింగ్తో చాలా ప్రజాదరణ పొందిన సాధువు. అతని భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, హారతి కార్యక్రమాలు నిర్వహించడం, 'నగర్ కీర్తన' నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహిస్తారు. ఆయన జయంతి సందర్భంగా ప్రధాని మోడీ (Narendra Modi) స్పందిస్తూ.. కులతత్వం, అంటరానితనం వంటి చెడు పద్ధతులను నిర్మూలించడానికి గురు రవిదాస్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. ప్రతి అడుగులోనూ, పథకంలోనూ తమ ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందని తెలిపారు. ఢిల్లీలోని శ్రీగురు రవిదాస్ విశ్రమ్ ధామ్ మందిర్ లో భక్తులో కూర్చొని భజనలు సైతం చేశారు.