selfie ban : అక్కడ సెల్ఫీలు దిగితే.. జైలుకే.. !!

By AN TeluguFirst Published Jun 29, 2021, 10:17 AM IST
Highlights

గుజరాత్ లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్ తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. 

సెల్ఫీల మోజులో ఆపదలను కొని తెచ్చుకోవడం మామూలుగా మారిపోయింది. ప్రపంచంలో యేటా నమోదవుతున్న సెల్ఫీ మరణాల్లో మన దేవం వాటా ఎక్కువగానే ఉంటోంది. పైగా వర్షాకాలం సీజన్ లో టూరిస్ట్ ప్రాంతాలకు క్యూ కడుతుండడం వల్ల ఇవి మరింత ఎక్కువగా నమోదు అవుతున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ లోని ఓ జిల్లాలో సెల్ఫీలపై పూర్తి నిషేధం విధించారు. 

గుజరాత్ లోని దంగ్ జిల్లా అధికారులు సెల్ఫీలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లకు ఫైన్ తో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సాత్పురలాంటి టూరిస్ట్ ప్రదేశాల్లో సెల్ఫీలు దిగడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని ఆ నోటిఫికేషన్ లో అధికారులు హెచ్చరించారు. 

ఈ మేరకు జూన్ 23నే అదనపు కలెక్టర్ పేరిట పబ్లిక్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి ప్రవాహాల ప్రాంతాలను సెల్ఫీ బ్యాన్ ఏరియాలుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.  అంతేకాదు వర్షాకాలం కావడంతో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున.. బట్టలు ఉతకడం, ఈత, స్నానం చేయడం నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. 

గతంలో 2019లో వాఘై-సాపుతరా హైవేపై సెల్పీలను దిగడం నిషేధించిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. ప్రకృతిని ఆస్వాదించడమనే వంకతో.. ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, కరోనా నిషేధాజ్ఞలు ఎత్తి వేయడంతో ప్రస్తుతం దంగ్ టూరిస్ట్ ప్రాంతాలకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్ఫీ నిషేధాజ్ఞలు జారీ కావడం కొసమెరుపు. అయితే, ఈ స్ఫూర్తితో తమ దగ్గర కూడా ఇలాంటి చట్టం తేవాలని కేరళలోని టూరిస్ట్ ప్రాంతాలున్న ఊర్లు కొన్ని డిమాండ్ చేస్తుండడం మరో విశేషం. 

click me!