బ్యాంకుల బాగోతం... 31 పైసల బకాయి కోసం.. రైతును తిప్పలు పెట్టిన ఎస్ బీఐ.. మొట్టికాయలు వేసిన కోర్ట్..

Published : Apr 29, 2022, 07:13 AM ISTUpdated : Apr 29, 2022, 08:05 AM IST
బ్యాంకుల బాగోతం... 31 పైసల బకాయి కోసం.. రైతును తిప్పలు పెట్టిన ఎస్ బీఐ.. మొట్టికాయలు వేసిన కోర్ట్..

సారాంశం

రుణ వసూళ్లలో సామాన్యులను బ్యాంకులు ఎలా సతాయిస్తాయో.. నిదర్శనంగా నిలిచే ఘటన తాజాగా అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. 31 పైసల కోసం ఓ రైతును సతాయించడంతో ఎస్ బీఐ బ్యాంకుపై అతను కోర్టుకు వెళ్లాడు.

అహ్మదాబాద్ : ఓ వైపు బ్యాంకుల్లో వందలకోట్లు అప్పులు తీసుకుని.. ఐపీ పెట్టి పారిపోయి.. నిండాముంచుతున్న వాళ్లను ఏమీ చేయలేని బ్యాంకులు.. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పోతుంటే చేతులు ముడుచుకుని కూర్చుంటున్న బ్యాంకులు...సామాన్యుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పైసా కోసం వేధిస్తుంటాయి.. ఈ ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటిని నిజం చేస్తూ అనేక సంఘటనలు కనిపిస్తుంటాయి. అలాంటివాటిని నిజం చేసేలా జరిగిన ఓ ఘటన గుజరాత్ లో తాజాగా వెలుగు చూసింది.  

ఓ రైతు కేవలం 31 పైసల బకాయిలు చెల్లించడం లేదని ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ‘నో డ్యూ సర్టిఫికెట్’  ఇవ్వలేదు. దీంతో ఆ రైతు భూమిని విక్రయించేటప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. ఇది కాస్త హైకోర్టుకు చేరడంతో ఎస్బిఐ తీరుపై  న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..అహ్మదాబాద్ సమీపంలోని గ్రామానికి చెందిన  శ్యాంజీ బాయ్ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని రాకేష్ వర్మ, మనోజ్ వర్మలకు విక్రయించాడు. అయితే అంతకంటే ముందే ఈ భూమిపై శ్యాంజీ రూ. మూడు లక్షల పంట రుణం తీసుకున్నాడు.  

భూమిని అమ్మిన కొద్దిరోజుల తర్వాత తాను బ్యాంకు నుంచి తీసుకున్న రుణం మొత్తాన్ని శ్యాంజీ తిరిగి చెల్లించారు. ఆ తరువాత కొనుగోలుదారులు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేరును నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దానికి సంబంధించి బ్యాంకు నో డ్యూ  సర్టిఫికెట్  ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. బ్యాంకు వద్దకు వెళితే సమస్య పరిష్కారం కాకపోవడంతో కొత్త యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.. బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని కోర్టు అడగగా… ఎస్బిఐ తరఫు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి అవాక్కయ్యారు. ‘ఆ పత్రాన్ని సిస్టం  జనరేట్ చేస్తుంది. రైతు తీసుకున్నరుణంలో ఇంకా 31 పైసలు ఉంది.  అందుకే సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు’ ఎస్బిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ సమాధానంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం.. 50 పైసల కంటే తక్కువ ఉన్న దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా కానీ మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇది ప్రజలను వేధించడం కాక మరేమిటి?’ అని కోర్టు ప్రశ్నించింది. బ్యాంకు మేనేజర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?