పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి.. రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ‌.. ఏం చెప్పిందంటే..?

By Mahesh RajamoniFirst Published Apr 23, 2023, 7:05 PM IST
Highlights

New Delhi: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఏప్రిల్ 23 న ఒకే రోజు 10,112 కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806 కు పెరిగింది. 
 

Centre writes to states on Covid-19 outbreak: భార‌త్ లో క‌రోనా వైరస్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతూనే ఉన్నాయి. ప‌లు రాష్ట్రాలు కోవిడ్ ఉద్ధృతి అధికంగా ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగా ఉన్న ప‌లు రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్రాల‌కు లేఖ రాసింది. కోవిడ్ నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొంది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో ఏప్రిల్ 23 న ఒకే రోజు 10,112 కొత్త కోవిడ్ -19 కేసులు న‌మోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806 కు పెరిగింది. తాజా కేసులతో కలిపి భారత్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4.48 కోట్లకు (4,48,91,989) చేరింది. అలాగే, కొత్త‌గా కేరళలో న‌మోదైన 29 మరణాలతో క‌లిపి దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 5,31,329 కు పెరిగింది.

గత 24 గంటల్లో 1,43,899 టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు మొత్తం క‌రోనా వైర‌స్ 92.54 కోట్ల పరీక్షలు నిర్వహించారు. వీక్లీ పాజిటివిటీ రేటు 5.43 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 67,806గా ఉంది. కరోనా నుంచి ఇప్పటివరకు 4,42,92,854 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం కోవిడ్-19 మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. 

గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు పెరిగిన ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానాలకు రాసిన లేఖలో ప్రశాంత్ భూషణ్ మహమ్మారి అంతం కాలేదని, సంక్రమణ వేగాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ కోసం త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. 

ఇదిలావుండ‌గా, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆసుపత్రి అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ అత్యవసర చర్యలు చేపట్టింది. తీవ్ర అస్వస్థతకు గురైన అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్పించేందుకు ఎయిమ్స్ ప్రతి ఇన్ పేషెంట్ వార్డులో రెండు పడకలను కేటాయించింది. ఎయిమ్స్ కు దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20,000 మందికి పైగా రోగులు వస్తుంటారు. ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడిసిన్, యూరాలజీ, ఈఎన్టీ, పీడియాట్రిక్ సర్జరీ, ఎండోక్రినాలజీ వంటి విభాగాల్లో ఎమర్జెన్సీ వార్డు పడకలకు ఈ కంటింజెన్సీ ప్లాన్ అదనంగా ఉన్నాయి.

click me!