
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసిందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.కేంద్ర ప్రభుత్వం. ఒకే దేశం- ఒకే ఎన్నికలకు అవకాశాలను రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుండి 22 వ తేదీ వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టుగా పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించిన మరునాడే ఈ ప్రకటన వెలువడింది. ఈ నెలలో నిర్వహించే ఒకే దేశం, ఒకే ఎన్నికలు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయనే ఊహగానాలు వెలువడుతున్నాయి. కానీ, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.
దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ కు ఒకే సారి ఎన్నికలు నిర్వహించడమే ఒకే దేశం, ఒకే ఎన్నికల ఉద్దేశ్యం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడ ఈ విషయాన్ని బీజేపీ ప్రకటించింది.ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మధ్యలో దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ , మే మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది చివర్లోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఒకే దేశం, ఒకే ఎన్నికల బిల్లును తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిందని సమాచారం.
1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు , పార్లమెంట్ కు ఎన్నికలు ఒకే సారి జరిగేవి. అయితే కొన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్రపతి పాలన విధింపు కారణంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు , పార్లమెంట్ కు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు వీలు లేకుండా పోయింది.కేంద్ర ప్రభుత్వం రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఒకే సారి దేశ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించ నివేదికను ఇవ్వనుంది. రామ్ నాథ్ కోవింద్ చైర్మెన్ గా మరో 16 మంది సభ్యులు ఈ కమిటీలో ఉండనున్నారని తెలుస్తుంది.