11 రోజుల క్రితం అదృశ్యం... బావిలో శవమై తేలిన బాలిక.. కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి

By Siva KodatiFirst Published May 28, 2022, 5:47 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. 11 రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ 16 ఏళ్ల బాలిక బావిలో శవమై తేలింది. మే 16వ తేదీ రాత్రి నుంచి ఆమె కనిపించడం లేదని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 

దాదాపు 11 రోజుల నుంచి కనిపించకుండాపోయిన పదహారేళ్ళ బాలిక ఓ బావిలో శవమై కనిపించడం ఉత్తరప్రదేశ్‌లో (uttar pradesh) కలకలం రేపింది. శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయని స్థానికులు చెప్పారు. ఈ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రామస్థులు చూడగా ఈ ఘటన వెలుగుచూసింది. 

పోలీసు సూపరింటెండెంట్ అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఊంఝ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఉన్న ఓ బావి నుంచి దుర్వాసన వస్తుండటంతో శుక్రవారం రాత్రి కొందరు గ్రామస్థులు వెళ్లి పరిశీలించారని ఆయన చెప్పారు. ఈ బావి అమర్ పాల్ సింగ్ అనే రైతు భూమిలో ఉందన్నారు. ఆ బావిలో ఓ బాలిక కాళ్ళు, చేతులు కట్టి ఉన్నట్లు కనిపించిందని అనిల్ కుమార్ వెల్లడించారు. మృతదేహాన్ని దాదాపు 10-12 రోజుల క్రితం పడేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

తన కుమార్తె కనిపించడం లేదని మృతురాలి తండ్రి మే 16న ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. మే 16 రాత్రి 8 గంటలకు ఆమె బహిర్భూమికి వెళ్లి, తిరిగి రాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. బాధితురాలి ఇంటికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని బావిలో ఆమె మృతదేహం లభించిందని చెప్పారు. ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందనే వాదనను కొట్టిపారేయలేమని అనిల్ పేర్కొన్నారు. నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారం గ్రామంలో సంచలనం సృష్టించింది. పోస్ట్‌మార్టం నివేదిక (post-mortem ) తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి రానున్నాయి. 

click me!