జయా శెట్టి హత్యకేసులో గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు శిక్ష ... ఇంతకీ ఎవరీమె?  

By Arun Kumar PFirst Published May 30, 2024, 3:07 PM IST
Highlights

గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ కు ముంబై న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2‌001 లో జరిగిన ఓ మహిళ హత్యకేసులో 23 ఏళ్ల తర్వాత ఇవాళ తీర్పు ఇచ్చింది న్యాయస్థానం. 

ముంబై : గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ ను ఓ మహిళ హత్యకేసులో దోషిగా నిర్దారించింది ముంబై కోర్టు. 2001 లో ముంబైలోని ఓ హోటల్ నిర్వహకురాలు దారుణ హత్యకు గురయ్యింది. ఈ హత్య చోటా రాజన్  పనే అని పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకేసులో 23 ఏళ్ల తర్వాత చోటా రాజన్ ను దోషిగా నిర్దారిచింది ప్రత్యేక న్యాయస్థానం. ఆయనకు ఏ శిక్ష విధించాలో మాత్రం న్యాయస్థానం ప్రకటించలేదు. 

ఏమిటీ హత్య కేసు :  

Latest Videos

సెంట్రల్ ముంబైలోని గామాదేవి ప్రాంతంలో గోల్డెన్ క్రౌన్ హోటల్ ను జయాశెట్టి అనే మహిళ నిర్వహించేది. 2001, మే 4న హోటల్లో వుండగా గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో వచ్చారు. వస్తూనే జయా శెట్టిని అత్యంత దారుణంగా హతమార్చి పరారయ్యారు.   

అయితే ఈ హత్య చోటా రాజన్ చేయించాడని పోలీస్ విచారణలో తేలింది. హత్యకు ముందు జయా శెట్టికి రాజన్ ఫోన్ చేసి బెదిరించేవాడని తేలింది. దీంతో తనకు చోటా రాజన్ నుండి ప్రాణహాని వుందని జయా శెట్టి పోలీసులను ఆశ్రయించారు... దీంతో సెక్యూరిటీ కల్పించారు. కొన్నాళ్లు ఈ సెక్యూరిటీని కొనసాగించిన పోలీసులు ఎలాంటి హాని లేదంటూ ఉపసంహరించుకున్నారు. ఇలా సెక్యూరిటీని తొలగించిన రెండు నెలలకే జయా శెట్టి హత్యకు గురయ్యారు. 

ఎవరీ చోటా రాజన్ :

ముంబైలో 1960 జనవరి 13న రాజేంద్ర సదాశివ్ నికాల్జే అలియాస్ చోటా రాజన్ జన్మించాడు. చిన్నతనం నుండే నేరాలబాట పట్టాడు.చిన్నచిన్న దొంగతనాలతో ప్రారంభమైన అతడి నేరాలు జాతీయ స్థాయిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్థాయికి చేరాయి. 

సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతుండగా అడ్డుకున్నాడని ఓ కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డాడు రాజన్. దీంతో మొదటిసారి జైలుకు వెళ్లాడు. జైల్లోంచి బయటకు వచ్చాక పూర్తిస్థాయి నేరగాడిగా మారిపోయి 1982 లో బడా రాజన్ గ్యాంగ్ లో చేరాడు.  అతడి హత్య తర్వాత ఆ గ్యాంగ్ కు లీడర్ గా మారి చోటా రాజన్ గా గుర్తింపు పొందాడు. 

1989 లో దుబాయ్ కి పారిపోయిన రాజన్ కు మాఫియా డాన్ దావుద్ ఇబ్రహిం గ్యాంగ్ తో పరిచయం పెరిగింది. దీంతో కొంతకాలం ఆ గ్యాంగ్ లో పనిచేసి దావుద్ కు కుడి భుజంగా మారాడు. ఇదే అతడిని అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్ స్టర్ గా మార్చింది. 

దావుద్ తో విబేధాలు రావడంతో ఆ గ్యాంగ్ నుండి బయటకు వచ్చిన చోటా రాజన్ స్వయంగా ఓ గ్యాంగ్ ను ఏర్పాటుచేసుకున్నాడు. సెటిల్ మెంట్స్, బెదిరింపుల స్థాయినుండి అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలు చేసే స్థాయికి రాజన్ గ్యాంగ్ చేరింది. తద్వారా భారీగా డబ్బులు సంపాదించాడు రాజన్. అతడి ఆగడాలు మరీ ఎక్కువ కావడంతో పోలీసులు నిఘా పెంచగా విదేశాలకు పారిపోయాడు. అయినా విడిచిపెట్టకుండా ఇంటర్ పోల్ సాయంతో ఇండోనేషియాలో అరెస్ట్ చేసారు. 

 

click me!