
న్యూఢిల్లీ: జీ 20 సదస్సును భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. ఈ సదస్సుకు భారత్ ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్నది. భారత్లో ఆతిథ్యం అదిరిపోయేలా ప్లాన్ చేసింది. ఈ దెబ్బతో ప్రపంచంలో భారత కీర్తి మరింత ఇనుమడించనుంది. ఇందులో భాగంగా జీ 20 సదస్సుకు వేదికగా దేశ రాజధాని నడిబొడ్డున అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ భరత్ మండపం నిర్మించారు. జీ 20 సదస్సు కారణంగా భారత్కు భరత్ మండపం అతిపెద్ద సభా వేదిక రూపంలో లభించినట్టయింది. భారత సంప్రదాయాలు, కళలు, ఆధునిక ఆర్కిటెక్చర్తో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. రూ. 2,700 కోట్లతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు.
ఈ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (ఐఈసీసీ) కాంప్లెక్స్ను భరత్ మండపం అని పిలుస్తారు. సెప్టెంబర్ 9వ, 10వ తేదీల్లో నిర్వహించే జీ 20 సమావేశాలకు ఇది వేదిక. జీ 20 ప్రధాన కార్యక్రమాలు భరత్ మండపం మెయిన్ కన్వెన్షన్ వెన్యూపై జరగనుంది. ఈ కన్వెన్షన్ సెంటర్లో కన్వెన్షన్ హాల్, యాంఫీ థియేటర్ ఉన్నది. 16 భాషల అనువాదాలతో మీటింగ్ రూమ్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ మండపం 123 ఎకరాల వైశాల్యంలో 5,500 వాహనాల పార్కింగ్ సౌకర్యంతో నిర్మించారు. ఈ వేదిక భారత దేశాన్ని ఒక అంతర్జాతీయ వ్యాపారానికి డెస్టినేషన్గా చూపిస్తుంది. భారత్లోని అతిపెద్ద మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్లకు డెస్టినేషన్గా భరత్ మండపాన్ని తీర్చిదిద్దారు.
బసవేశ్వరుడి ఆలోచనకు రూపమైన అనుభవ్ మండపం నుంచి భరత్ మండపం అనే పేరును తీసుకున్నారు. ఇందులో అనేక మీటింగ్ రూమ్లు, లాంజ్లు, ఆడిటోరియాలు, ఒక యాంఫీ థియేటర్, ఒక బిజినెస్ సెంటర్ ఉన్నది. ఈ కన్వెన్షన్ సెంటర్లోని మల్టీపర్పస్ హాల్, ప్లీనరీ హాల్ల సీటింగ్ కెపాసిటీ కలిపి చూస్తే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌజ్ కంటే కూడా ఎక్కువే. మొత్తంగా సీటింగ్ కెపాసిటీ 7000 మంది ఈ కన్వెన్షన్ హాల్లో కూర్చోవచ్చు. ఈ కన్వెన్షన్ హాల్ నిర్మాణ రూపాన్ని శంఖం నుంచి తీసుకున్నారు.
Also Read: భారత్కు గుడ్ టైమ్.. మంచి పనులకు జీ 20తో సుముహూర్తం
ఇందులోని గోడలు, కన్వెన్షన్ హాల్ ముందు వైపు గోడలపై భారత సంప్రదయాలను, సంస్కృతిని వెల్లడించే ఎన్నో చిత్రణలు ఉన్నాయి. ఇందులో సూర్యశక్తి, జీరో టు ఇస్రో, పంచ మహాభూతాలు కూడా ఉన్నాయి. సూర్య శక్తిని వినియోగించుకోవడంలో భారత్ కృషిని సూర్య శక్తిగా, ఇస్రో సాధించిన విజయాలకు ప్రతీకగా జీరో టు ఇస్రో, పంచభూతాలైన ఆకాశం, వాయు, అగ్ని, జలం, పుడమిని చూపించేలా చిత్రణలు ఉన్నాయి.
జీ 5 వైఫై, జీ10 ఇంట్రానెట్ కనెక్టివిటీ, 16 భాషాల్లో వివరణలు అందుబాటులో ఉండేలా ఇంటర్ప్రెటేర్ రూమ్లు, ఏవీ సిస్టమ్లు ఉన్నాయి. నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఇందులో మొత్తం 24 మీటింగ్ రూములు ఉన్నాయి. ఇందులో 20 రూములు గ్రౌండ్ లెవెల్లోనే ఉండగా.. నాలుగు రూములు 200 మంది సామర్థ్యంతో, ఏడు గదులు 100 మంది, తొమ్మిది రూములు 50 మంది సామర్థ్యంతో మీటింగ్ రూములు ఉన్నాయి.
పెయింటింగ్లు, కార్పెట్లు దేశం నలుమూలల నుంచి సేకరించారు. రాజస్తాన్ను చిత్రించే అనేక పెయింటింగ్లు ఈ గోడలపై ఉన్నాయి. యూపీ, కశ్మీర్ నుంచి కార్పెట్లను తెచ్చారు.