
Dr Sarfarazuddin and family: గత ఐదేళ్లుగా ప్రతిరోజూ 100 మంది నిరుపేదలకు అన్నదానం చేస్తూ విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో గుర్తుతెలియని కరోనా రోగుల మృతును ఇంటికి తీసుకువచ్చి స్వయంగా అంత్యక్రియలు చేసి మానవతను చాటుకున్నారు. నిరుపేద కుటుంబాల కూతుళ్లకు వివాహాలు సైతం తన సొంత ఖర్చులతో జరిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. అయనే డాక్టర్ సర్ఫరాజుద్దీన్. ఆయన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలోని సెక్టార్-105లో నివసిస్తున్న హోమియో వైద్యుడు.
నిరుపేదలకు ఉచిత విద్య..
డాక్టర్ సర్ఫరాజ్ సమాజసేవకు కొత్త నిర్వచనంలా కనిపిస్తూ.. వివిధ స్థాయిల్లో మంచి పనులు చేస్తుంటారు. గత ఐదేళ్లుగా రోజూ 100 మందికి ఒక పూట భోజనం అందిస్తున్నారు. అలాగే, 2009లో నోయిడాకు సమీపంలోని గెజా అనే గ్రామంలో నిరుపేద పిల్లల కోసం తన సొంత డబ్బుతో పాఠశాలను ప్రారంభించి ఉచితంగా విద్యను అందిస్తున్నారు. పాఠశాలలో రెండు అంతస్తుల్లో 20 గదులు ఉన్నాయి. తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన లేదా అనాథలుగా ఉన్న విద్యార్థులు, ఇంటి సహాయకుల పిల్లలు, రోజువారీ కూలీలు, గార్డులు, తోటమాలి, స్వీపర్లు.. ఇలా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇక్కడ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తున్నారు.
వీరిలో కొంతమంది నామమాత్రపు ఫీజులు చెల్లిస్తారు. మొత్తం 400 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది ముస్లిమేతరులు కాగా, వారిలో 40 మంది సమీప మదర్సాలకు చెందినవారే. ఆధునిక విద్య లేని గెజాలోని మదర్సాల విద్యార్థులను ఇటీవల తన పాఠశాలకు పిలిపించి, వారికి ఆధునిక విద్య ప్రాథమికాంశాలను బోధించి, కంప్యూటర్ శిక్షణ ఇచ్చి, వారిని తన ఎంఎం స్కూల్ (యుపి బోర్డ్) లో 8వ తరగతి విద్యార్థులతో సమానంగా తీసుకువచ్చి, వారు బోర్డు పరీక్షలు రాయడానికి, తరువాత పోటీ సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుగుణంగా వారిని ముందుకు నడుపుతున్నారు. అంతేకాకుండా వాలీబాల్ ఆడాలనుకునే విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం కూడా మొదలుపెట్టాడు. ఇది వారిని ఫిట్ గా ఉంచుతుందనీ, వారిలో కొందరు బాగా ఆడితే వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు.
క్రీడల్లోనూ శిక్షణ..
ఈ పిల్లలు మదర్సాలు, సమీప ప్రభుత్వ పాఠశాలలకు చెందినవారు, వారికి స్థలం లేదా ఉచిత కోచ్లు లేవు. ఇలాంటి 100 మంది విద్యార్థులు వివిధ సెషన్లలో కోచింగ్ తీసుకుంటారు, వారిలో ఎక్కువ మంది ముస్లిమేతరులు ఉన్నారనీ, నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తూ.. వారి చదువులకు తోడ్పాటునందిస్తున్న డాక్టర్ సర్ఫరాజ్ తో కలిసినడుస్తున్న వాలీబాల్ కోచ్, 20 ఏళ్ల విశాల్ తెలిపారు. "మా నాన్న దినసరి కూలీ, అమ్మ ఇంటి పనిమనిషి. నా చదువు, శిక్షణ కొనసాగించడానికి నాకు డబ్బు అవసరం. కాబట్టి నేను అతని పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చాను. దీనికి ఆయన వెంటనే అంగీకరించారు. ఇప్పుడు నేను ఎటువంటి రుసుము చెల్లించని 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను, కానీ సర్ఫరాజ్ సర్ నుండి నాకు మంచి పారితోషికం లభిస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడాను. నేను మరింత మెరుగ్గా ఆడగలిగితే నన్ను విడిగా స్పాన్సర్ చేస్తారు' అని తెలిపాడు. తన కుటుంబ సభ్యుల కోసం తీసుకునే మందుల కోసం ఎప్పుడూ తన నుంచి ఛార్జీలు వసూలు చేయడని కూడా చెప్పారు.
నిరుపేదలకు ఉచిత వైద్యం..
డాక్టర్ సర్ఫరాజ్ శని, ఆదివారాల్లో గెజాలోని తన క్లినిక్ లో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందిస్తారు. ఉచితంగా మందులు కూడా ఇస్తారు. అంతేకాకుండా నిరుపేద రోగుల కోసం క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్, లాక్డౌన్ సమయంలోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ఎంతో మందికి వైద్యం అందించారు. అయితే, కొన్ని నెలలుగా నిధుల లేమితో శిబిరాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. తక్కువ మాటలు మాట్లాడే ఈ వ్యక్తిని తన సేవ గురించి చెప్పుకోవడం కూడా తక్కువేనని తెలిసిన వారు పేర్కొంటున్నారు. తమను తాము పబ్లిక్ గా ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి ఇష్టపడకుండా నిశ్శబ్దంగా సామాజిక సేవ చేసే అరుదైన వారిలో ఒకరిగా, అందరికీ ఆదర్శమైన వ్యక్తిగా నిలుస్తున్నారు.
తన తండ్రితో కలిసి ప్రయాణం..
యూపీలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న తన తండ్రి సామాజిక సేవ చేయడంపై తనకు ఎప్పుడూ ఆదర్శ వ్యక్తిగా ఉన్నారనీ, అయన నుంచే పేదలకు సేవ చేయాలనే ఆసక్తి తనలో ఏర్పడిందని డాక్టర్ సర్ఫరాజ్ చెప్పారు. పేదలకు సేవ చేయడం అనే భావనను తనలో విలీనం చేసుకున్నాననీ, దీంతో తన క్లినిక్ ను భంగెల్ నుండి గెజాకు మార్చడంతో తన తండ్రితో కలిసి సేవ చేయడం ప్రారంభించానని చెప్పారు. నిధులను ఎలా మేనేజ్ చేస్తారనే విషయంపై ఆయన మాట్లాడుతూ.. 'లోటులో ఉన్నా చేస్తాను. పాత బకాయిలను చెల్లించి మళ్లీ కొత్త వాటిని రుణంగా తీసుకుంటాం. నా జేబు నుండి ఖర్చు చేయడమే కాకుండా, నాకు మద్దతు ఇచ్చే పలువురు స్నేహితులు ఉన్నారు. కొన్నిసార్లు తెలియని మూలాల నుంచి కొంత సహాయం అందుతుంది. ఈ మధ్య కాలంలో నా హోమియోపతి క్లినిక్ తో పాటు చిన్న మెడికల్ సెంటర్ ను కూడా నడుపుతూ మంచి పనులకు అయ్యే ఖర్చును భరిస్తున్నాను" అని వివరించారు.
కరోనా లాక్డౌన్ సమయంలో నోయిడాలో ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలను చూసి సర్ఫరాజ్ తన దాతృత్వ కార్యక్రమాలను మరింత విస్తరించినట్టు చెప్పారు. వారిని చూస్తుంటే బాధగా ఉండేదనీ, తినడానికి అరటిపండ్లు, ఇతర పండ్లు, బిస్కెట్లు, ఆహారం అందించామని తెలిపారు. తనతో పాటు మరికొంత మంది స్నేహితులు.. వలస కార్మికులకు ఆహారం ఇవ్వడానికి చాలా రోజులు రోడ్డుపై నిల్చున్న క్షణాలను గుర్తు చేశారు. కరోనా సమయంలో కోవిడ్-19 తో చనిపోయిన వారిని ఇంటికి తీసుకురావడానికి నిరాకరించిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కోట్లాది రూపాయలతో నడుస్తున్న ఎన్జీవోలు సైతం చేయలేని పనులను చేస్తూ డాక్టర్ సర్ఫరాజుద్దీన్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.