
త్వరలో దేశ రాజధానిలో జీ20 సదస్సు జరగనుంది. దీని కోసం ఢిల్లీలో ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపడుతున్నారు. అయితే అందులో భాగంగా ధౌలా కువాన్ వద్ద శివలింగం ఆకారంలో ఉన్న ఫౌంటైన్లు ఏర్పాటు చేసింది. ఇది రాజకీయ వివాదానికి దారితీసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం హిందువుల విశ్వాసంతో ఆడుకుంటుందని బీజేపీ ఆరోపించింది. ఈ వివాదంలో రెండు పార్టీల మధ్య మళ్లీ వార్ మొదలైంది.
దీనిపై బీజేపీ జాతీయ కార్యదర్శి మంజిందర్ సింగ్ సిర్సా ‘టైమ్స్ నౌ’తో మాట్లాడుతూ ఆప్ పై మండిపడ్డారు. ‘‘మతంపై ఎవరూ రాజకీయాలు చేయొద్దు ఒకరి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకోవడం చాలా తప్పు, కానీ ఆప్ దీనికి కొత్త కాదు. దురదృష్టవశాత్తు, వారు ఇలాంటి చర్యలను కూడా సమర్థిస్తున్నారు’’ అని అన్నారు.
దేశ రాజధానిలో శివలింగం లాంటి ఫౌంటైన్లపై బీజేపీ నేత చారు ప్రగ్యా మొదట విమర్శలు చేశారు. ‘‘శివలింగం అలంకరణ కోసం కాదు. ధౌలా కువాన్ జ్ఞానవాపి కాదు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ధౌలా కువాన్ వద్ద శివలింగ ఆకారంలో ఫౌంటైన్లను ఏర్పాటు చేసింది’’ అని ఆమె తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్టు చేసింది.
జీ 20 సదస్సు నేపథ్యంలో 10 ప్రధాన ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా దౌలా కువాన్ లో శివలింగ ఆకారంలో ఉన్న ఫౌంటైన్లతో పాటు, 49 థీమ్ శిల్పాలు, జంతు విగ్రహాలు, 6-16 అడుగుల ఎత్తైన విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ జంక్షన్ లో ఆరు అడుగుల ఎత్తైన సింహాలు, నృత్యం చేస్తున్న మూడు మహిళల విగ్రహాలు, మెహ్రామ్ నగర్ లో రెండు ఇసుకరాయి ఏనుగులు, పాలెం విమానాశ్రయం టెక్నికల్ ఏరియాలోని హనుమాన్ మందిర్ జంక్షన్ లో 6 అడుగుల అప్సర శిల్పాలు, ఉలన్ బతార్ రోడ్డులో 13 అడుగుల ఎత్తైన నల్ల పాలరాతి సింహం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కాగా.. జీ20 సదస్సు కోసం దేశ రాజధానిని సుందరీకరించిన ఘనత కోసం ఆప్, బీజేపీ పోటీ పడుతున్నాయి. శివలింగ ఫౌంటెన్లపై వివాదం మొదలవక ముందే ఢిల్లీలో జీ-20 సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని బీజేపీ చెబుతోంది. ఢిల్లీ సుందరీకరణ పనులను చూస్తున్న సంస్థలు - ఎన్డీఎంసీ, ఐటీపీవో, డీడీఏ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్, ఢిల్లీ పోలీసులు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ - అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు. అయితే ఈ డబ్బును ఆప్ ప్రభుత్వ నిధి, పన్ను చెల్లింపుదారుల డబ్బు ద్వారా అందిస్తున్నట్లు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చెప్పారు.