
అహ్మదాబాద్: 28 ఏళ్ల పాటిదార్ లీడర్ హార్డిక్ పటేల్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. బీజేపీలోకి చేరే ముహూర్తం ఖరారు అయింది. జూన్ 2వ తేదీన ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నాడు. కొన్ని వారాల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్డిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీలోకి చేరుతున్నాడు. గాంధీనగర్లో బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు ఆయనను స్వాగతించనున్నారు.
అయితే, హార్డిక్ పటేల్ను బీజేపీలోకి చేర్చుకునే కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ నేతలు హాజరయ్యే అవకాశాలు లేవని తెలుస్తున్నది. గాంధీనగర్ పార్టీ హెడ్ క్వార్టర్లో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్దిక్ పటేల్ పార్టీ కండువా కప్పుకోనున్నాడు.
పాటిదార్ కోటా ఆందోళనతో నేతగా ఎదిగిన హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆయనపై ఎక్కువ ఆసక్తి కానరాలేదు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగడానికి ముందు ఆయన బీజేపీపై ప్రశంసలు కురిపించారు.
దేశానికి ప్రతిపక్షం అత్యవసరమైన కాలాల్లో కాంగ్రెస్ అగ్రనాయకత్వం విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటారని హార్దిక్ పటేల్ ఆరోపించారు. రాహుల్ గాంధీపైనా విమర్శలు చేశారు. కాగా, బీజేపీ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నదని వివరించారు.
కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్ సోమవారం బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలను ఖండించారు. అలాగే, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై విమర్శల దాడి చేశారు. "నేను సోమవారం బీజేపీలో చేరడం లేదు.. అలాంటిదేమైనా జరిగితే మీకు తెలియజేస్తాను" అని పటేల్ మీడియాకు వెల్లడించారు. అలాగే, పంజాబ్ లోని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పటేల్ ట్వీట్ చేస్తూ "ఏ ప్రభుత్వమైనా అస్తవ్యస్తమైన చేతుల్లోకి వెళ్లడం ఎంత ఘోరమైనదో ఈ రోజు చాలా విచారకరమైన సంఘటనతో పంజాబ్ గ్రహించింది. కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడి దారుణ హత్య, ఇప్పుడు ప్రముఖ యువ కళాకారుడు సిద్ధూ మూసావాలే ను కాల్చి చంపారు.. అనేక ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు" అని పేర్కొన్నారు.
“పంజాబ్ ముఖ్యమంత్రి మరియు ఢిల్లీ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రజలు పంజాబ్కు బాధ కలిగించడానికి కాంగ్రెస్లాగా మరో పార్టీగా మారాలనుకుంటున్నారా లేదా ప్రజలకు నిజంగా ఏదైనా చేయాలనుకుంటున్నారా అని ఆలోచించాలి. సిద్ధూ మూసేవాలాకు నా నివాళి. " అని ఆయన మరో ట్వీట్లో పేర్కొన్నారు.