
Delhi Minister Satyendar Jain arrest: మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత.. ఆమ్ ఆద్మీ (ఆప్) స్పందిస్తూ.. అరెస్టును రాజకీయ ప్రేరేపిత చర్యగా పేర్కొంది. రాబోయే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం ఎపిసోడ్ రాజకీయ ప్రేరణ కోణంలో ముందుకు సాగుతున్నదని ఆరోపించింది. జైన్ను హిమాచల్ప్రదేశ్కు ఇన్ఛార్జ్గా చేశారని, కొండ ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, అందుకే ఆయనను అరెస్టు చేశారని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మీడియాతో అన్నారు.
“సత్యేందర్ జైన్ ఒక నకిలీ కేసులో అరెస్టయ్యాడు, 8 సంవత్సరాల నాటి కేసుకు సంబంధించి అతను ఏడు సార్లు ED ముందు హాజరయ్యారు. సిబిఐ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది” అని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా బీజేపీ ఈ కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు. “ఈ కేసు దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఎత్తి చూపుతోంది. ఇది నిరాధారమైన మరియు ఫేక్ కేసు కాబట్టి త్వరలో సత్యేందర్ జైన్ బయటపడతారు” అని సింగ్ అన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించిందని ఆయన అన్నారు. మా 34 మంది ఎమ్మెల్యేలను కటకటాల వెనక్కి నెట్టారని, అందరూ క్లీన్ చిట్తో వచ్చారని ఆయన అన్నారు. బీజేపీ ఏం చేసినా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలుస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కోల్కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్ను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారులు ధ్రువీకరించినట్టుగా న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. సత్యేందర్ జైన్.. 2015-16లో కోల్కతాకు చెందిన సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. ఆ సమయంలో సత్యేందర్ జైన్ పబ్లిక్ సర్వేంట్గా ఉన్నారు.
ఇక, గత నెలలో.. సత్యేందర్ జైన్, అతని కుటుంబానికి చెందిన రూ. 4.81 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు 2018లో సత్యేంద్ర జైన్ను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది పంజాబ్ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సత్యేందర్ జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. సత్యేందర్ జైన్ అరెస్ట్పై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అరెస్టుపై మనీష్ సిసోడియా స్పందిస్తూ.. సత్యేంద్ర జైన్పై 8 ఏళ్లుగా ఫేక్ కేసు నడుస్తోందని.. ఇప్పటి వరకు ఈడీ ఆయనకు చాలాసార్లు సమన్లు పంపిందని.. కొంతకాలం తర్వాత ఈడీ ఆయనకు ఫోన్ చేయడం మానేసిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇన్చార్జి సత్యేంద్ర జైన్గా ఉన్నందున ఇప్పుడు వారు మళ్లీ చర్యలు ప్రారంభించారని అన్నారు.