మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ ప్రాంతంలోనిమార్వెల్ విస్టా కమర్షియల్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.15 గంటలకు మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ ప్రాంతంలోనిమార్వెల్ విస్టా కమర్షియల్ భవనంలోని ఏడో అంతస్తులో ఉన్న వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.15 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. మంటల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైరింజన్లు, రెండు అదనపు వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.
అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టుగా నివేదించబడలేదు. అయితే రెస్టారెంట్లో మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. ‘‘ఉదయం 9.15 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు చెలరేగిన సమయంలో రెస్టారెంట్ మూసివేయబడి ఉన్నందున ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు’’ అని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు.
పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇక, అదే బిల్డింగ్ కింది అంతస్తులో క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి.