పెళ్లి వేడుకలో ఫొటోల కోసం గొడవ.. తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో బంధువుల చికిత్స

By Mahesh KFirst Published Dec 10, 2022, 6:03 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో డిసెంబర్ 8న పెళ్లి వేడుకలో తామే ముందు ఫొటోలు దిగుతామని పోటీ పడ్డారు. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు ఆస్పత్రిపాలయ్యారు.
 

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో పెళ్లి వేడుకలో గందరగోళం ఏర్పడింది. వరమాల తంతు ముగిసిన తర్వాత స్టేజీ పై ఫొటోల కోసం వరుడు, వధువు వైపు బంధువుల మధ్య గొడవ జరిగింది. తాము ఫస్ట్ ఫొటోలు దిగుతామంటే.. కాదు కాదు.. తాము దిగుతామని గొడవ పెట్టుకున్నారు. ఇదే విషయమై తీవ్రంగా వాదులాడుకున్నారు. చివరకు వారు హాస్పిటల్ పాలయ్యారు. ఈ ఘటన డియోరియా జిల్లాలో డిసెంబర్ 8వ తేదీన చోటుచేసుకుంది.

అప్పటి వరకు ఆ పెళ్లి సజావుగానే జరిగింది. వరుడు, వధువు స్టేజీపై కూర్చున్నారు. అప్పుడే వరమాల తంతు ముగిసింది. ఆ తర్వాత బంధువులు ఒకరి తర్వాత ఒకరు స్టేజీపైకి వచ్చి ఫొటోలు దిగాల్సి ఉన్నది. వరుడు, వధువు వైపు బంధువుల మధ్య వాగ్వాదం మొదలైంది. తామే ముందు ఫొటోలు దిగుతామని పోటీ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న కొందరు ఈ పోటీకి తెరలేపారు. చివరకు ఈ పోటీ ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది.

Also Read: పెళ్లిలో షాండ్లియర్ లో తండ్రితో కలిసి వధువు ఎంట్రీ.. మండిపడుతున్న నెటిజన్లు..

ఈ దాడిలో వరుడు మామ తీవ్రంగా గాయపడ్డాడు. వరుడి సోదరి కూడా గాయపడింది. అలాగే, ఓ బీజేపీ లోకల్ లీడర్ కూడా గాయపడ్డాడు. అనంతరం, గాయపడ్డవారిని వారే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు స్పాట్‌కు వచ్చారు. కానీ, అంతలోపే గాయపడ్డవారు హాస్పిటల్ వెళ్లిపోయారు. 

ఈ ఘటనతో వరుడు బాధపడ్డాడు. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. తాను ఈ పెళ్లే చేసుకోనని అన్నాడు. కానీ, బంధువులు, ఇతరులు వరుడికి సర్ది చెప్పారు. చివరకు పోలీసుల సమక్షంలో ఆ పెళ్లి జరిగింది.

click me!