
బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలన్నది నేటి యువత కల. వీరిలో చాలా మందికి రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదు. అనవసరమైన విషయాల్లో తలదూర్చి లేని పోని ఇబ్బందులు ఎందుకన్న భావనతో యువత రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు.
ఇక మిస్ ఇండియ వంటి పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచిన అందగత్తె ఏం చేస్తుంది.. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో పనిచేస్తుంది. ఇక ఎండార్స్మెంట్లు, వాణిజ్య ప్రకటనలు వీలుంటే సినిమాల్లో ఆఫర్లు కొట్టేసి చేతి నిండా సంపాదిస్తుంది. కానీ వీటన్నింటిని వదిలేసి పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా బరిలోకి దిగింది మిస్ ఇండియా ఫైనలిస్ట్.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జాన్పూర్ జిల్లా బక్షా డెవపల్పెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలిచింది. ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్, అందాల రాణి దీక్షా సింగ్ బరిలోకి దిగుతున్నారు.
2015లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్గా నిలిచిన దీక్షా సింగ్.. ప్రైవేటు ఆల్బమ్స్తో పాటు పలు ప్రకటనల్లో నటించారు. తండ్రి కోరిక మేరకు ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
దీక్ష తండ్రి జితేంద్ర సింగ్.. పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్మెంట్ బ్లాక్లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ స్థానాన్ని ప్రభుత్వం మహిళలకు కేటాయించడంతో దీక్షను బరిలోకి దించుతున్నారు జితేంద్ర.
ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థి షాలినీ సింగ్తో తలపడనున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. అయితే వీరి కుటుంబం వ్యాపార రీత్యా గోవాలో స్థిరపడింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్లలో ట్రాన్స్పోర్టు బిజినెస్ నిర్వహిస్తున్నారు.
కాగా, యూపీలో ఏప్రిల్ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జాన్పూర్ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్ 15న పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం.