
పంజాబ్ : తమకిష్టంలేని పని చేసిందనో.. తమ కులం, మతం కాని వ్యక్తులతో తిరుగుతుందనో కన్నబిడ్డలనే కర్కశంగా కడతేరుస్తున్న ఘటనలు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. పరువు పేరుతో అతి దారుణంగా కన్న బిడ్డలను పొట్టన బెట్టుకుంటున్నారు. పంజాబ్ లో తాజాగా ఇలాంటి హృదయవిధారక ఘటనే వెలుగు చూసింది.
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో ఓ వ్యక్తి తన కుమార్తెను నరికి చంపి, ఆమె మృతదేహాన్ని బైక్కు కట్టి, రోడ్డుపై ఈడ్చుకెళ్లి రైలు పట్టాలపై పడేశాడు. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం జరిగింది. నేరానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. ప్రాథమిక విచారణలో నిందితుడు తన కుమార్తెపై అనుమానంతో.. ఆమెను హత్య చేసినట్లు తేలింది.
పాదచారిని ఢీకొట్టిన కారు.. నాలాలో పడి చనిపోయిన బాధితుడు.. 36 గంటల తరువాత మృతదేహం బయటకు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తరువాత తిరిగి వచ్చింది. అప్పటికే తండ్రి పదునైన ఆయుధాలతో రెడీగా ఉన్నాడు. వెంటనే ఆమె మీద దాడిచేసి హత్య చేశాడు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
"ఈ సమయంలో నిందితుడు తన కుటుంబ సభ్యులను ఇంట్లో నిర్బంధించాడు. అడ్డువచ్చినా, అరిచినా వారిని కూడా చంపేస్తానని బెదిరించాడని మాకు సమాచారం అందింది. దీంతో భయంతో వారు గదిలోనుంచి బయటికి వెళ్ళలేకపోయారు" అని ఒక పోలీసు అధికారి చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
బాధితురాలి అమ్మమ్మ మాట్లాడుతూ.. "నా మనుమరాలు ఇంట్లో నుంచ వెళ్లిపోయింది. మళ్లీ ఆమె తనంతట తాను తిరిగి వచ్చింది. ఆమె తిరిగిరావడంతోనే అతను మండిపడ్డాడు. మారణాయుధాలతో ఆమెను చంపాడు" అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్లో పరువు హత్య కలకలం రేపుతోంది. అమేథీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని హత్య జరిగింది. తమ సామాజిక వర్గానికి కాకుండా ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో తిరుగుతోందనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులే ఆమెను దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు.
బాధితురాలి పేరు అఫ్రీన్. ఆమెను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఆగస్టు 5 తెల్లవారుజామున పూడ్చిపెట్టారు. ఆ తరువాత, ఆమె అనారోగ్యంతో చనిపోయిందని ఊర్లో వారికి చెప్పారని పోలీసులు తెలిపారు. అయితే, ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇది పరువు హత్య కేసు అని పోలీసులు తెలిపారు. ఆగస్టు 4న, అఫ్రీన్ తండ్రి, సోదరుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బాలిక స్థానిక మార్కెట్లో ఒక యువకుడితో కలిసి షికారు చేస్తుండగా, ఆమె తండ్రి నియామత్ ఉల్లా, సోదరుడు హైదర్ అలీ ఆమెను పట్టుకుని బహిరంగంగా కొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు స్థానికులు వీడియోను రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించారు, దీంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు వారు తెలిపారు.
బాలిక తన కుటుంబ సభ్యులతో ఇంటికి వెళ్లేందుకు ఇష్టపడలేదు, అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో అంగీకరించింది. గ్రామస్తులు చెబుతున్న దాని ప్రకారం, ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబం అఫ్రీన్ను తీవ్రంగా కొట్టారు. ఫలితంగా ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు.
ఇది పరువు హత్య కేసు అని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 304 (అపరాధపూరితమైన హత్య) కింద బాధితురాలి తండ్రి, సోదరుడిపై కేసు నమోదయ్యింది.