మిస్టరీ.. ఆ కుటుంబానికి కరోనా ఎలా సోకింది..?

By telugu news teamFirst Published May 2, 2020, 12:20 PM IST
Highlights

దీంతో అధికారుల అనుమతి తీసుకుని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సొంత జిల్లా మాండ్యకు తరలించారు. మృతదేహంతో పాటు ఆరుగురు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ దేశంలోనూ విలయ తాండవం చేస్తోంది. ఎప్పుడు ఎవరికి ఎలా వైరస్ సోకుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా ఓ కుటుంబంలోని వ్యక్తులకు వైరస్ సోకగా.. వాళ్లకి అసలు ఎలా కరోనా వచ్చిందనే విషయం మిస్టరీగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాకు చెందిన ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ ముంబయిలో జీవనం కొనసాగిస్తున్నాడు. అతను గుండెపోటుతో ఇటీవలే మృతి చెందాడు. దీంతో అధికారుల అనుమతి తీసుకుని మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు సొంత జిల్లా మాండ్యకు తరలించారు. మృతదేహంతో పాటు ఆరుగురు ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు.

మార్గం మధ్యలో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడికి వీరు లిఫ్ట్‌ ఇచ్చారు. అయితే డ్రైవర్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత.. నిబంధనల ప్రకారం అతని కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆరుగురిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అంతే కాదు.. మధ్యలో వాహనం ఎక్కిన మహిళకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. డ్రైవర్‌ కుమారుడు ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. అతని ద్వారానే కుటుంబ సభ్యులకు కరోనా సోకి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మధ్యలో ఎక్కిన మహిళ ద్వారా వ్యాపించిందా? అనేది తేలాల్సి ఉంది.

ఈ ఘటనపై మాండ్య డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ ఎంవీ వెంకటేశ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మృతదేహం వెంట ఆరుగురికి ఎందుకు అనుమతిచ్చారని ముంబయి అధికారులను ఆయన ప్రశ్నించారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించకుండా.. కంటైన్‌మెంట్‌ జోన్‌ నుంచి ఎలా బయటకు ఎలా పంపిస్తారని అడిగారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఎవరెవరికి కరోనా సోకిందో తెలియాల్సి ఉంది. కాగా అంత్యక్రియలకు హాజరైన వారంతా భయంతో వణికిపోతున్నారు.

click me!