అబద్ధపు వరకట్నం వేధింపుల ఆరోపణలు తీవ్ర క్రూరత్వమే: హైకోర్టు

Published : Sep 03, 2023, 07:25 PM IST
అబద్ధపు వరకట్నం వేధింపుల ఆరోపణలు తీవ్ర క్రూరత్వమే: హైకోర్టు

సారాంశం

అబద్ధపు వరకట్నం వేధింపులు, అవాస్తవ లైంగికదాడి ఆరోపణలు భర్తపై చేయడం.. ఆయనపట్ల తీవ్ర క్రూరత్వాన్ని ప్రదర్శించడమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. హిందూ వివాహ చట్టం కింద తీవ్ర క్రూరత్వం కారణంగా ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.  

న్యూఢిల్లీ: భర్త కుటుంబంపై అబద్ధపు వరకట్నం వేధింపుల ఆరోపణలు చేసినా.. వారిపై తప్పుడు లైంగిక దాడి ఆరోపణలు చేసినా అది తీవ్ర క్రూరత్వం కిందికే వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అవాస్తవ ఆరోపణలను అంగీకరించలేమని వివరించింది. 

వైవాహిక బంధానికి సాంగత్యం, దాంపత్య సంబంధం పునాది వంటివని హైకోర్టు చెప్పింది. ఒకరి కంపెనీ మరొకరికి భారంగా, బాధగా మారితే ఆ వైవాహిక బంధం ఎంతో కాలం కొనసాగలేదని నిరూపితమవుతుందని వివరించింది. అలాగే.. వారి మధ్య దాంపత్య సంబంధం లేదంటే(లేకుండా చేసినవారిపట్ల) అది కూడా తీవ్రమైన క్రూరంగానే చూడాలని తెలిపింది.

ఓ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. ‘ఈ కేసులో రెండు పార్టీలు 2014 నుంచి వేరువేరుగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య దాంపత్య సంబంధం, పరస్పరం చేదోడు వాదోడుగా ఉండే అనుబంధాన్ని వారు కలిగి లేరు. వీరు సుమారు తొమ్మిదేళ్లుగా వేరుగానే ఉంటున్నారు. ఇది తీవ్రమైన మానసిక క్రూరత్వమే, క్రూరత్వం కింద ఈ పెళ్లిని వెంటనే రద్దు చేయాలని చెబుతున్నాం’ అని న్యాయమూర్తులు సురేశ్ కుమార్ కైత్, నీనా బన్సల్ క్రిష్ణ చెప్పారు.

Also Read: భర్తను నల్లవాడని పిలవడం క్రూరత్వమే: దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు

భర్తపై భార్య వేసిన తప్పుడు కేసులు ఆయనకు మానసిక క్రూరత్వాన్ని కలిగించాయని బెంచ్ తెలిపింది. ‘కేవలం వరకట్నం మాత్రమే కాదు.. లైంగిక ఆరోపణలను కూడా ఆమె తన భర్త, భర్త కుటుంబ సభ్యులపై చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవాలని తేలాయి. ఇది ఆమోదయోగ్యం  కాని తీవ్రమైన క్రూరత్వమే అవుతుంది’ అని వివరించిది. 

ఈ జంట కేవలం 13 నెలలు మాత్రమే కలిసి జీవించింది. ఆ తర్వాత వేరుగా ఉన్నారు. తన భర్త, భర్త సోదరుడిపై ఆమె క్రిమినల్ కేసు పెట్టింది. ఈ కేసుల్లో ట్రయల్ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది. 

పెళ్లియినప్పటి నుంచి ఇంటిలో ఆమె బాధ్యతలు నిర్వర్తించలేదని, తనకు, తన కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే తరుచూ ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయేదని భర్త చెప్పాడు. ఆత్మహత్య చేసుకుని తమను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని కూడా ఆమె బెదిరించిందని వివరించాడు. తమతో వాదులాడిందని, భౌతికంగానూ తనపై దాడి చేసిందని చెప్పాడు. కాగా, తన భర్త, అత్త శారీరకంగా, మానసికంగా తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu