Mohammad Zubair Bail Plea: మహ్మద్ జుబేర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. బెయిల్ పిటిష‌న్ తిరస్కరణ‌

Published : Jul 16, 2022, 07:58 PM IST
Mohammad Zubair Bail Plea: మహ్మద్ జుబేర్ కు మ‌రో ఎదురుదెబ్బ‌.. బెయిల్ పిటిష‌న్ తిరస్కరణ‌

సారాంశం

Mohammad Zubair Bail Plea: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ పిటిష‌న్ ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్   సెషన్స్ కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. రిమాండ్ పై విచారణ జూలై 20 న జరుగుతుంది

Mohammad Zubair Bail Plea: ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ బెయిల్ పిటిష‌న్ ను ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ క్ర‌మంలో మహ్మద్ జుబేర్ తరపు న్యాయవాది హర్జీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. జుబైర్ బెయిల్ దరఖాస్తు ఆంగ్లంలో దాఖలు చేయబడింది. ఈ కారణంగా విచారణ వాయిదా పడింది. సెప్టెంబర్ 2021లో నమోదైన కేసుకు సంబంధించి లఖింపూర్ ఖేరీ కోర్టు జుబేర్‌కు సమన్లు ​​జారీ చేసింది. జుబైర్‌ను పోలీసు రిమాండ్‌పై తీసుకునేందుకు జూలై 20న విచారణ ఉంటుందని తెలిపారు. అంతకుముందు శుక్రవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో కూడా జుబైర్ బెయిల్ కోసం విచారణ జరిగిందని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. అభ్యంతరకర ట్వీట్ విష‌యంలో నమోదైన మ‌రో కేసులో జుబైర్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు విచారించింది. ఈమేరకు ఆయ‌న‌ సోమవారం సీతాపూర్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచార‌ణకు హాజ‌ర‌య్యారు. ఈ కేసులో జుబేర్‌ను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. 
 
తొలుత గత సంవత్సరం జుబైర్ చేసిన ట్వీట్ పై సుదర్శన్ న్యూస్ &టీవీ ఛానెల్ జర్నలిస్ట్  ఫిర్యాదు చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంపై సుదర్శన్ ఛానల్ కవరేజీపై ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కేసు న‌మోదు పెట్టారు. జుబైర్ ఇప్పటికే జూలై 27 వరకు హత్రాస్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

జుబేర్‌పై  7 కేసులు  

మత విద్వేషాలు రేపాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆల్ట్ న్యూస్ కో-ఎడిటర్ జుబేర్ పై దేశ‌వ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో 6 కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే నమోదయ్యాయి, ఒక కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. వీటిలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ కేసుల్లో బెయిల్‌ పొందారు. ప్రస్తుతం 5 కేసుల్లో కస్టడీలో ఉండగా.. ఈ కారణంగా రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. 

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై పెట్టిన ఆరు కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రద్దు చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు అతనిపై అనేక కేసులను విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. 

ఈ క్ర‌మంలో మంగళవారం జరిగిన విచారణలో, జుబైర్ తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎఎస్ బోపన్న జుబైర్ పిటిషన్‌పై స్పందించేందుకు యుపి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చారు. 

యూపీలో మ‌రో కేసులో జుబైర్‌కు శుక్ర‌వారం బెయిల్ మంజూరు చేస్తూ.. అదనపు సెషన్స్ జడ్జి దేవేందర్ కుమార్ జంగాలా మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు విమర్శలకు సిద్ధంగా ఉన్నాయని, అంటే కేవలం ఏ పార్టీపైనా విమర్శలు ఒక వ్యక్తిని శిక్షించడానికి ఆధారం కాదని అన్నారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాల స్వరం అవసరమ‌నీ, నిస్సందేహంగా వాక్ స్వాతంత్ర్యం ప్రజాస్వామ్య సమాజానికి సరైన పునాదని కోర్టు పేర్కొంది.

జూన్ 27న అరెస్టు  

నాలుగేళ్ల క్రితం ప్రముఖ హిందీ సినిమా స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ చేసిన ట్వీట్‌పై మొహమ్మద్ జుబేర్‌ను జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం యూపీ పోలీస్‌లో అతనిపై నమోదైన కేసులో రిమాండ్‌కు తరలించారు. యూపీలో హత్రాస్, లఖింపూర్ ఖేరీ, ఘజియాబాద్, సీతాపూర్, ముజఫర్ నగర్‌లలో జుబైర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో నాలుగు కేసుల్లో అరెస్టయ్యాడు. వాటిలో ఢిల్లీ, సీతాపూర్, హత్రాస్ మరియు లఖింపూర్ ఖేరీ కేసులు ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu