Arvind Kejriwal: "ఉచిత విద్య‌, వైద్య అందించ‌డం త‌ప్పా?"  ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌పై విరుచుక‌ప‌డ్డ కేజ్రీవాల్

Published : Jul 16, 2022, 06:19 PM IST
Arvind Kejriwal: "ఉచిత విద్య‌, వైద్య అందించ‌డం త‌ప్పా?"  ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌పై విరుచుక‌ప‌డ్డ కేజ్రీవాల్

సారాంశం

Arvind Kejriwal On Freebies: ప్రధాని మోదీ శనివారం నాడు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు

Arvind Kejriwal On Freebies: ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర‌ ప్రభుత్వాలు ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డాన్ని తాయిలాల‌ సంస్కృతిగా అభివర్ణించారు. అయితే.. ప్ర‌ధాని ప్రకటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిప‌డ్డారు. 

ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిచ‌డం తప్పా? అని ప్ర‌శ్నించారు. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాం..  అద్భుతమైన మొహల్లా క్లినిక్‌లను నిర్మించాం. దాదాపు 2 కోట్ల మంది ఉచిత చికిత్స పొందగలిగే ఏకైక మెగాసిటీ ఢిల్లీ అనీ, ఇక్క‌డ 50 లక్షల వరకు శస్త్రచికిత్సలు జ‌రిగాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు.

అలాగే.. దేశంలో ఎక్క‌డ లేని విధంగా.. ఉన్న‌త ప్ర‌మాణాల‌తో ఉచిత‌ విద్యను అందిస్తున్నామ‌ని,   గతంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉండేదని విమ‌ర్శించారు. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది పిల్లలు చదువుతున్నారని, నేడు పేదల పిల్లలు నీట్, జేఈఈలో ఉత్తీర్ణులవుతున్నారనీ, వేల మంది పిల్లల భవిష్యత్తును మార్చామ‌ని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం తప్పా? అని ప్ర‌శ్నించారు. ఉచిత విద్య, ఉచిత వైద్య ఓట్ల కోసం తాయిలాలు కావ‌ని అన్నారు.

మన దేశంలోని పిల్లలకు ఉచితంగా, నాణ్య‌మైన‌ విద్యను అందించాలని, ప్రజలకు మంచి, ఉచిత వైద్యం అందించాలని, ఉచితంగా అందించే ప్ర‌తి వాటిని ఓట్ల కోసం అందించే తాయిలాలు అన‌డం స‌రికాదన్నారు. అభివృద్ధి చెందిన, అద్భుతమైన భారతదేశానికి పునాది వేస్తున్నామనీ, 75 ఏళ్ల క్రితమే ఈ ప‌ని చేయాల్సి ఉండేన‌నీ, ఈరోజు ఈ పిల్లల భవిష్యత్తును మనం చక్కదిద్దితే.. నేరం చేస్తున్న‌ట్టా? అని ప్ర‌శ్నించారు. 

తాయిలాలంటే..? 

ఓట్ల కోసం అందించే తాయలాల గురించి అరవింద్ కేజ్రీవాల్ వివ‌రించారు. ఓ కంపెనీ చాలా బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని డబ్బులు మాయం చేసింది. బ్యాంకు దివాళా తీసిందని, ఆ కంపెనీ ఒక రాజకీయ పార్టీకి కోట్లాది రూపాయలను విరాళంగా ఇచ్చిందని, ఆ కంపెనీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఇది తాయిలం అని  అన్నారు. 

ఉచితాల‌పై ప్రధాని మోదీ ఏమ‌న్నారు?

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం సందర్భంగా, మన దేశంలో ఉచిత ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి..   ఓట్లను కొల్లగొట్టే సంస్కృతిని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలా ఓట్ల కోసం తాయిలాలిచ్చే సంస్కృతి దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం. ఈ సంస్కృతి పట్ల దేశ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, మరీ ముఖ్యంగా యువత తాయిలాల సంస్కృతి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM