సీఎంగా ఉద్థవ్ థాక్రే బాధ్యతలు: తర్వాతి రోజే ఫడ్నవీస్‌కు కోర్టు సమన్లు

By Siva KodatiFirst Published Nov 29, 2019, 4:08 PM IST
Highlights

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నాగపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.

బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు నాగపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను పేర్కొనలేదని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా నాగ్‌పూర్‌కు చెందిన న్యాయవాది సతీశ్ యూకే వేసిన పిటిషన్‌ను స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు నవంబర్ 1న పునరుద్ధరించింది.

అయితే గతంలో న్యాయవాది వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ముంబై హైకోర్టు సమర్ధించింది. అయితే సదరు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్‌పై విచారణ చేపట్టాలని అక్టోబర్ 1న అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. దీనిపై స్థానిక మేజిస్ట్రేట్ కోర్ట్ నవంబర్ 4న ఆదేశాలు జారీ చేసింది.

Also read:గోవా రాజకీయాల్లో సంజయ్ రౌత్ వేలు... అక్కడ బీజేపీ అధికారం కోల్పోతుందని జోశ్యం

అయితే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ఫడ్నవీస్‌కు సమన్లు రావడం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. 1996, 98లో ఫడ్నవీస్‌పై మోసం, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాలను ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనకుండా దాచిపెట్టారన్నది అభియోగం.

గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. 

శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉద్థవ్ వెల్లడించారు. సామ్నా పత్రికను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1988లో స్థాపించారు. అప్పటి నుంచి పార్టీకి గొంతుకగా సామ్నా మారిపోయింది.

ఈ పత్రిక వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఉద్ధవ్ థాక్రేనే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో పదవిలో ఉండటం భావ్యం కాదని భావించిన ఉద్థవ్ ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు. 

Also Read:'అష్ట'దిగ్గజ నవ నాయకుడు ఉద్ధవ్

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన అజిత్, తన వర్గం ఎమ్మెల్యేలు  కలిసిరాకపోవడంతో, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు, గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.

 

 

click me!