బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య గత నెలలో చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం నేలపై ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచిన ఘటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య గత నెలలో చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం నేలపై ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ను తెరిచిన ఘటన తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. ఈ ఘటనను ధ్రువీకరించిన సింధియా.. తేజస్వీ సూర్య పొరపాటున విమానం ఎగ్జిట్ డోర్ తెరిచారని చెప్పారు. జరిగిన పొరపాటుకు ఆయన క్షమాపణలు చెప్పారని అన్నారు.
‘‘ఈ సంఘటన జరిగినప్పుడు తేజస్వి సూర్య స్వయంగా పైలట్, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డీజీసీఏ దర్యాప్తు చేసినందున పూర్తి ప్రోటోకాల్ను అనుసరించారు. అన్ని తనిఖీల తర్వాతే విమానం బయలుదేరింది. సంఘటన కారణంగా జరిగిన ఆలస్యానికి అతడు స్వయంగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలను పరిశీలించడం ముఖ్యం. విమానం నేలపై ఉండగా పొరపాటున ఆయన తలుపు తెరవడంతో అన్ని తనిఖీల అనంతరం విమానాన్ని టేకాఫ్కు అనుమతించారు. జరిగిన పొరపాటుకు క్షమాపణ కూడా చెప్పారు’’ అని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
Also Read: భారతదేశంలో లౌకికతత్వం ప్రమాదంలో పడింది.. సెక్యులర్, డెమొక్రటిక్ శక్తులు ఏకం కావాలి: డీ రాజా
ఇక, ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు టేకాఫ్కు ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. 2022 డిసెంబర్ 10వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ ప్రయాణికుడి చర్య.. విమానంలోని తోటి ప్రయాణీకుల్లో భయాందోళనలకు కారణమైంది. చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్లే ముందు విమానం నేలపై ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తనిఖీల అనంతరం విమానం బయలుదేరింది. అయితే విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ని అనుకోకుండా తెరిచిన ప్రయాణికుడు బీజేపీ యువమోర్చా చీఫ్ తేజస్వీ సూర్య అని వార్తలు వస్తున్న రావడంతో.. కాంగ్రెస్ బీజేపీపై విమర్శల దాడిని పెంచింది. ఈ ఘటనను ప్రభుత్వం ఇంత కాలం ఎందుకు దాచిపెట్టిందని ప్రశ్నించింది. అయితే ఈ ఆరోపణలపై సూర్య కానీ, అతని కార్యాలయం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు.