
Election Commission : త్వరలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలలో పోటీ చేయనున్న అభ్యర్థుల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే.. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా తాజా నిర్ణయంతో దానిని 95 లక్షలకు పెంచారు. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల్లో పాల్గొనే వారి ఆదాయ పరిమితి కూడాపెంచేసింది. ఇప్పటి వరకూ రూ.54 లక్షలు ఉండగా.. దాన్ని 75 లక్షలకు పెంచేసింది ఎన్నికల సంఘం.
అలాగే.. అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గోనే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచేసింది. 28 లక్షలుగా పరిమితిని 40 లక్షలకు పెంచేసింది. ఎన్నికల వ్యయ పరిమితిపై గతంలో 2014లో ప్రధాన సవరణ జరిగింది. ఇది 2020లో మరో 10 శాతం పెరిగింది. ఈ అంశంపై ఎన్నికల సంఘం మాజీ అధికారి హరీశ్కుమార్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం ఎన్నికల సంఘం. ఇందులో IRS అధికారి, ప్రధాన కార్యదర్శి ఉమేష్ సిన్హా .. భారత ఎన్నికల కమిషన్లో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ చంద్ర భూషణ్ కుమార్ లున్నారు.
ఈ కమిటీ ప్రధానంగా ఎన్నికల ఖర్చులు.. ఇతర సంబంధిత అంశాలపై అధ్యయనం చేసింది. అందుకు తగిన సిఫార్సులు చేసింది. ఈ కమిటీ రాజకీయ పార్టీలు, ఎన్నికల ప్రధాన అధికారులు, ఎన్నికల పరిశీలకుల నుంచి సలహాలను ఆహ్వానించింది. ఈ కమిటీ 2014 నుంచి ఓటర్ల సంఖ్య, వ్యయ ద్రవ్యోల్బణం సూచీ, గమనించింది. రాబోయే రోజుల్లో క్రమ క్రమంగా వర్చువల్ ప్రచారాలుగా మారుతున్నయని ఎన్నికల ప్రచారంలో మారుతున్న పద్ధతులను కూడా ఈ కమిటీ ప్రస్తవించింది.
మరోవైపు, గురువారం కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఆరోగ్య శాఖల భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా.. దేశంలో ఉన్నకరోనా పరిస్థితిలు, కొత్త వేరియంట్ ఓమిక్రాన్ పరిస్థితిని సమీక్షించింది. ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లోని ఓటర్లతోపాటు సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలనీ తెలిపింది. దీంతో పాటు ఎన్నికల ప్రచారం, ఓటింగ్ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలకు సంబంధించి వైద్య నిపుణుల నుంచి కమిషన్ సూచనలు తీసుకుంది.
త్వరలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిపై కూడా కమిషన్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో చర్చించింది. ఇక మరికొద్ది రోజుల్లో కమిషన్ పోలింగ్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అంతకుముందు డిసెంబరు 27న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. చర్చ సందర్భంగా, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.