
National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంగీకరించింది. తన విచారణను జూన్ 17 కాకుండా జూన్ 20కి వాయిదా వేయాలని రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను ఈడీ గురువారం ఆమోదించింది. ఈ వారంలో ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17( శుక్రవారం)న విచారణకు కావాలని ఆదేశించింది.
అయితే, ఈ కేసు విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ రాశారు. ఇందులో సోనియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. తన తల్లి కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారనీ, తన తల్లి సోనియా గాంధీని తాను చూసుకోవాలని రాహుల్ గాంధీ EDకి లేఖ రాశారు. శుక్రవారం కాకుండా సోమవారం తన ప్రశ్నలను తిరిగి ప్రారంభించాలని దర్యాప్తు సంస్థను అభ్యర్థించారు.
రాహుల్ గాంధీ అభ్యర్థనను అంగీకరించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జూన్ 20న నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణలో పాల్గొనాల్సిందిగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆయన తన తల్లి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి అనారోగ్యం కారణంగా ఈ సడలింపు ఇచ్చినట్టు ఏజెన్సీ వర్గాలు భావిస్తున్నాయి.
కోవిడ్ సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు జూన్ 2న పాజిటివ్ అని తేలింది. సోనియా గాంధీని కూడా జూన్ 23న ఈ కేసులో ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది.ఇదిలా ఉండగా.. రాహుల్పై ఈడీ విచారణకు వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తున్నది.
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఈ వారం మూడు రోజుల పాటు మొత్తం 30 గంటలపాటు విచారించింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను కలిగి ఉన్న కాంగ్రెస్ ప్రమోట్ చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ విచారణ జరిగింది. వార్తాపత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురించింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (YIL) యాజమాన్యంలో ఉంది.
గత మూడు రోజులుగా ఈడీ ఎదుట విచారణకు హాజరైన రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. వారిలో పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఢిల్లీ పోలీసు సిబ్బంది ప్రవేశించి పార్టీ కార్యకర్తలను కొట్టారని కాంగ్రెస్ బుధవారం ఆరోపించడంతో నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ పిలుపు మేరకు గురువారం కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా అన్ని రాజ్భవన్లలో ఘెరావ్ నిర్వహించారు.
అంతకుముందు రోజు, కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడుతో సమావేశమై దేశ రాజధానిలో తమ నిరసనల సందర్భంగా కొంతమంది మహిళలతో సహా పార్టీ చట్టసభ సభ్యులపై ఢిల్లీ పోలీసులు చర్య తీసుకున్న విషయాన్ని లేవనెత్తారు. వారితో ఉగ్రవాదులు ప్రవర్తించారని ఆరోపించారు. అలాగే.. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు, రాహుల్ గాంధీని ED ని అడ్డుపెట్టుకుని అమానిస్తున్నారని ఆరోపించారు.