
కర్ణాటకలో సీఎం అభ్యర్ధి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ , మాజీ సీఎం సిద్ధరామయ్యలు ముఖ్యమంత్రి రేసులో వున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక కోసం బెంగళూరులోని షంగ్రిల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరుగుతోంది. డీకే, సిద్ధూలతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా హోటల్కు చేరుకున్నారు. అటు డీకే, సిద్ధరామయ్య అభిమానులు హోటల్ వద్దకు చేరుకుని నానా హంగామా సృష్టించారు.
తమ నేతనే సీఎంగా చేయాలని వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఈ గుంపును చెదరగొట్టారు. అంతకుముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఇళ్ల వద్ద కూడా ఇదే హైడ్రామా నడిచింది. తమ నేతను సీఎం చేయాలంటూ వారి మద్ధతుదారులు నినాదాలు చేయడంతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య , డీకే శివకుమార్లు విడివిడిగా భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: మా నాయకుడినే సీఎం చేయాలి : డీకే, సిద్ధూ ఇళ్ల వద్ద మద్దతుదారుల ఆందోళన, హైడ్రామా
మరోవైపు.. సీఎం ఎంపిక నేపథ్యంలో పరిశీలకులను నియమించింది ఏఐసీసీ. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వీరంతా సీఎల్పీ సమావేశంలో పాల్గొని అధిష్టానానికి నివేదికను అందజేయనున్నారు. సీఎం ఎవరైతే బాగుంటున్న దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైతే రహస్య ఓటింగ్ విధానం ద్వారా సీఎంను ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.
మరోవైపు.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.