
యోగి కేబినేట్ లో ఒక్క సారిగా అసంతృప్తులు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ జలశక్తి శాఖ సహాయ మంత్రి దినేష్ ఖటిక్, అలాగే పీడబ్లూడీ మంత్రి జితిన్ ప్రసాద్ లు రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. గత కొంత ఇద్దరి రాజీనామా విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జలశక్తి శాఖలో బదిలీలు, హస్తినలో తన మద్దతుదారులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో దినేష్ ఖటిక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే జితిన్ ప్రసాద కూడా తన ఓఎస్డీ బదిలీపై ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది. దీనిని బలపరస్తూ అర్థరాత్రి నుంచి వారి ఫోన్లన్నీ స్విచ్ఛాఫ్ అయ్యాయి. అయితే ఈ వాదనలను ప్రభుత్వం కొట్టిపారేసింది. అలాంటిదేమీ లేదని తేల్చిచెప్పింది.
పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఆందోళన.. కాంగ్రెస్తో కలిసి నిరసనల్లో పాల్గొన్న టీఆర్ఎస్
ప్రభుత్వ వాహనంతో పాటు భద్రతను కూడా మంత్రి దినేష్ ఖాటిక్ వదిలిపెట్టడం చర్చనీయాంశమైంది. అలాగే ఆయన తన అధికారిక నివాసంలో లేదా మీరట్లోని హస్తినాపూర్లోని తన వ్యక్తిగత నివాసంలోనూ కనిపించడం లేదు. వర్గాల సమాచారం ప్రకారం.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జరిగిన బదిలీల్లో అక్రమాలకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవడంపై జితిన్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయమై మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయిన ఆయన ఈరోజు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కానున్నారు.జితిన్ ప్రసాద్ తన అభిప్రాయాన్ని అమిత్ షా ఎదుట ఉంచవచ్చని భావిస్తున్నారు. అలాగే దినేష్ ఖటిక్ తో కూడా అమిత్ భేటీ అవుతారని సమాచారం.
మంగళవారం యోగి కేబినెట్ సమావేశానికి చేరుకున్న జితిన్ ప్రసాద్, దినేష్ ఖటిక్ లు మీడియా ముందు కనిపించలేదు. ఖటిక్ తన అధికారిక నివాసానికి కూడా రాలేదు. ఆయన తన ప్రభుత్వ వాహనాన్ని, సెక్యూరిటీని విడిచిపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే యోగి ప్రభుత్వ ఉన్నతాధికారులు మాత్రం దీన్ని ఖండించారు. ACS వనీత్ సెహగల్ దీనిని పుకారుగా పేర్కొన్నారు. కాగా ఖటిక్ మీరట్లోని హస్తినపూర్ స్థానం నుంచి ఖాటిక్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
దినేష్ ఖటిక్ అసంతృప్తికి కారణం ఏంటి ?
జల్ శక్తి శాఖ సహాయ మంత్రి దినేష్ ఖటిక్ తన కేబినెట్ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్పై ఆగ్రహం చేశారని వార్తలు వినిపించాయి. మంత్రిగా ఉన్న ఆయన శాఖకు ఎలాంటి పని ఇవ్వడం లేదని, అలాగే తాను సిఫారసు చేసిన ఇంజనీర్ల బదిలీ ప్రక్రియ కూడా పూర్తి కావడం లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇదే కాకుండా గత నెలలో మీరట్లో దళిత యువకులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. అనంతరం తన మద్దతుదారులపై అలాగే పోలీసులపై కూడా కేసు నమోదు అయ్యింది. తన అనుచరులపై కేసులు పెట్టడం కూడా ఆయనకు నచ్చలేదని తెలుస్తోంది.