
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఓ మైనర్ మల్లయోధురాలు దాఖలు చేసిన పోక్సో కేసులో ఆధారాలు లేవని, ఆ కేసును కొట్టేయాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరారు. మైనర్ రెజ్లర్ పై లైంగిక వేధింపులు చేసినట్టు ఆధారాలేవీ లేవని, కాబట్టి, కేసును కొట్టేయడం ఉత్తమం అని ఢిల్లీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ ఓ రిపోర్టును ఢిల్లీ పోలీసులు గురువారం కోర్టులో ఫైల్ చేశారు.
ఈ కేసులో పురోగతికి సంబంధించిన నివేదికను ఢిల్లీ పోలీసులు పాటియాల హౌజ్ కోర్టులో దాఖలు చేశారు. కాగా, ఢిల్లీ పోలీసుల మరో టీమ్ దేశ రాజధానిలోని రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసినట్టు తెలిసింది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ పై అంశాల గురించి స్పందిస్తూ.. పోక్సో కేసు క్యాన్సిలేషన్ కోసం రిపోర్టు ఫైల్ చేశారని వివరించారు. ఇది పోక్సో యాక్ట్కు సంబంధించిన కేసు కాబట్టి, ఈ పిటిషన్ పై జులై 4వ తేదిన విచారణ చేస్తామని వాయిదా వేసిందని తెలిపారు.
Also Read: ఓయో హోటల్కు లవర్ను రమ్మన్నాడు.. తాడుతో ఉరేసి చంపేశాడు.. ఎందుకంటే?
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా మల్లయోధులు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బ్రిజ్ భూషణ్ పై చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఒక కేసు నమోదైంది. కాగా, ఓ మైనర్ రెజ్లర్ కూడా పై ఆరోపణలు చేయగా.. ఆమె తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదైంది. ఇటీవలే మైనర్ బాలిక తండ్రి తన స్టేట్మెంట్లో మార్పులు చేశారు. మైనర్ బాలిక పై లైంగిక వేధింపుల ఆరోపణలను ఉపసంహరించుకున్నారు.
ఆ మైనర్ రెజ్లర్ కూడా ఆరోపణలను ఉపసంహరించుకున్నట్టు తెలిసింది. తాను ఎంతో కష్టపడ్డానని, ఎంతో శ్రమించినా చివరకు తనను సెలెక్ట్ చేయలేదని, కాబట్టే... ఆయనపై లైంగిక ఆరోపణలు చేశానని ఆ మైనర్ బాలిక పేర్కొన్నట్టు సమాచారం.
తండ్రి తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడంతో దాని ఆధారంగానే పోలీసులు తాజా రిపోర్టు ఫైల్ చేసినట్టు తెలుస్తున్నది.