
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు పిల్లలపై వీధి కుక్కల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఐదేళ్లు, ఏడేళ్లు ఇద్దరు సోదరులపై మూడు రోజుల వ్యవధిలోనే వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమస్యకు పరిష్కారంగా వారం లోపల యాక్షన్ ప్లాన్ తీసుకురావాలని అధికారులను షెల్లీ ఒబెరాయ్ అడిగారు.
కాగా, వెటరినరీ నిపుణులు, జంతు సంక్షేమానికి సంబంధించిన ఎన్జీవోలతో ఢిల్లీ మేయర్ మరో సమావేశాన్ని నిర్వహించనున్నారు. బుధవారం ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు.
వీధి కుక్కల నుంచి ఢిల్లీ వాసులను రక్షించడానికి ఓ యాక్షన్ ప్లాన్ను వారంలోపు సిద్ధం చేసి తీసుకురావాలని మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధికారులను ఆదేశించారు. ఇదే సమస్యపై జంతువులకు సంబంధించిన ఎన్జీవోలు, గోశాల ఆపరేటర్లు, వెటరినరీ నిపుణులతో బుధవారం ఢిల్లీ మేయర్ భేటీ కాబోతున్నట్టు అధికారులు తెలిపారు.
Also Read: పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే కారణం.. : కాంగ్రెస్
కాగా, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కమిషనర్ జ్ఞానేశ్ భారతి కి సమన్లు పంపింది. కుక్కల దాడిలో పిల్లలు మరణించిన ఘటనకు సంబంధించి మార్చి 17వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఎన్సీపీసీఆర్ సమన్లు పంపింది.
కుక్కల బెడదను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సివిక్ బాడీకి తాము లేఖ రాసినట్టు పోలీసులు తెలిపారు.