
ఢిల్లీ ఎక్సైజ్ స్కాంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఈడీ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. మరోవైపు ఢిల్లీ ఎక్సైజ్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫినిక్స్ గ్రూప్ కంపెనీ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 25 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహించింది.
ఇకపోతే.. ఎక్సైజ్ పాలసీ చుట్టూ ముసురుకున్న ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర చేసిందని, ఇందుకోసం డిప్యూటీ సీఎం, ఆప్లో నెంబర్ 2 మనీష్ సిసోడియాకు సీఎం పోస్టును ఆఫర్ చేసిందని ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ఆపరేషన లోటస్ ద్వారా కేజ్రీవాల్ సర్కారును కూల్చాలని బీజేపీ పన్నాగం పన్నిందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.
ALso REad:మనీష్ సిసోడియాకు సీఎం పోస్టు ఆఫర్ చేసిన బీజేపీ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించింది: ఆప్
మనీష్ సిసోడియాను ఎక్సైజ్ పాలసీ ఆధారంగా టార్గెట్ చేశారని, సీఎం పోస్టు ఆశ చూపించారని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ అన్నారు. మనీష్ సిసోడియా ఆప్ను వదిలి బీజేపీలో చేరితే ఆయనపై నమోదైన కేసులు అన్నింటినీ ఎత్తేస్తామని, ఢిల్లీ సీఎం పోస్టు కూడా ఇస్తామని ఆఫర్ చేసిందని ఆరోపించారు. కానీ, మనీష్ సిసోడియా ఆ ఆఫర్ను తిరస్కరించారని తెలిపారు. దీంతో బీజేపీ మరోసారి తమ ప్రభుత్వాన్ని కూల్చడంలో విఫలం అయిందని వివరించారు.
ముందుగా వారు విద్యా రంగాన్ని టార్గెట్ చేసి మనీష్ సిసోడియాను లోబర్చుకోవాలని ప్రయత్నించారని అన్నారు. కానీ, అది సాధ్యం కాలేదని, ఆ తర్వాత ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకుందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత 31 లొకేషన్లలో సీబీఐ దాడులు చేసిందని అన్నారు. ఈ దాడుల్లోనూ వారికి ఏమీ దొరక్కపోవడంతో మనీష్ సిసోడియాకు సీఎం పోస్టు ఆఫర్ చేశారని తెలిపారు. ఐదు కోట్ల రూపాయలను కూడా ఆప్ నేతకు ఆఫర్ చేసి భంగ పడ్డారనీ ఆరోపించారు.