
తిరువణ్ణామలై : తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఓ అపూర్వమైన ఘటన చోటు చేసుకుంది. వందేళ్ల తరువాత చెల్లన్కుప్పం గ్రామంలోని మారియమ్మన్ ఆలయంలోకి దళితులు ప్రవేశించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గొడవలు తలెత్తకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా దళితులు ఆలయంలోకి ప్రవేశించడం నిషిద్ధం.
మొదటిసారిగా బుధవారం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని చెల్లన్కుప్పం గ్రామంలోని మారియమ్మన్ ఆలయంలోకి అనేక దళిత కుటుంబాలు ప్రవేశించాయి. అయితే, పోలీసులు ఊహించినట్టుగా వేరే సామాజికవర్గాలప్రజలనుంచి ఇప్పటివరకు ఎలాంటి నిరసనను నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. గ్రామంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అమానుషం.. కొడుకు పుడితే పార్టీ ఇవ్వలేదని.. దళిత వ్యక్తిని ఇనుపరాడ్లతో కొట్టి హత్య...
జులైలో దళితులు, వన్నియార్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ అంశంపై ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవతో ఆలయ ప్రవేశ ఉద్యమం మొదలైంది. దళితులు, వన్నియార్లకు చెందిన యువకులు ఒకే పాఠశాలలో చదివి ఉద్యోగాల కోసం చెన్నైకి వెళ్లారు. దళితులకు ఆలయంలోకి ప్రవేశించే హక్కుపై మొదట సోషల్ మీడియాలో వాదించుకున్న వారిద్దరూ గ్రామంలో కలుసుకున్నప్పుడు ఘర్షణకు దిగారు.
అనంతరం దళితులు తమను ఆలయంలోకి అనుమతించాలంటూ జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. బుధవారం తాము ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటించడంతో డీఐజీ (వెల్లూరు రేంజ్) ఎంఎస్ ముత్తుసామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
“కొత్తగా పెళ్లయిన వ్యక్తులు ఈ ఆలయంలో మొక్కుకుంటే.. పొంగలి వండిపెడితే.. వారు కోరుకున్నది నెరవేరుతుందని బలమైన నమ్మకం. కానీ మమ్మల్ని ఎప్పుడూ అక్కడికి అనుమతించలేదు. ఆలయంలోకి ప్రవేశించడానికి, దేవుడ్ని కొలవడానికి, పూజలు చేయడానికి, పొంగలి వండడానికి మా మొక్కులు తీర్చుకోవడానికి జిల్లా అధికారులు మాకు సహాయం చేసినందుకు ఈ రోజు సంతోషంగా ఉన్నాం” అని 50 ఏళ్ల దళిత మహిళ అన్నారు. ఇప్పటి వరకు దళితులు గ్రామంలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన కాళియమ్మాళ్ ఆలయంలో మొక్కులు తీర్చుకునేవారు.