Joshimath: ఉత్తరాఖండ్లోని పవిత్ర పట్టణం జోషిమఠ్ లో పగుళ్లు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల భయాందోళనలు అధికం అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అక్కడి ప్రాంతాన్ని ఖాళీ చేయగా.. మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జోషిమఠ్ పగుళ్లపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది.
Uttarakhand's sinking town Joshimath: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. ఇప్పుడు పగుళ్లు గతంలో కంటే భయానక రూపం దాల్చుతున్నాయి. ఇంతకుముందు రెండు అంగుళాలు మాత్రమే ఉన్న పగుళ్లు ఇప్పుడు 8-9 అంగుళాలకు పెరిగాయి. రెండు హోటళ్లు (మలారి ఇన్, మౌంటెన్ వ్యూ) కూలిపోయే అవకాశం కూడా పెరిగింది. వచ్చే వారం నాటికి రెండు హోటళ్లు కూలిపోతాయని భావిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. మిగతా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారులను అదేశించింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జోషిమఠ్ పగుళ్లపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది.
జోషిమఠ్ పగుళ్లుపై కేంద్రం ఉన్నతస్థాయి సమావేశం
ఉత్తరాఖండ్లో పగుళ్లకు గురవుతున్న జోషిమఠ్ పట్టణంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) ఆదివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం జరపడానికి నిర్ణయించింది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రటరీ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. జోషిమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి.
స్థానికులు ఏమంటున్నారంటే..
అయితే, జోషిమఠ్ లో పగుళ్లు రావడానికి, కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ.. ఎన్టీపీసీ సొరంగంలో పేలుళ్లు జరుగుతున్న తీరు కూడా భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. కాగా, ఈ నిర్మాణంలో ఉన్న ఈ 12 కిలోమీటర్ల పొడవైన సొరంగం సెలాగ్ అనే ప్రదేశం నుండి ప్రారంభమవుతుంది, ఇది తపోవనం వరకు వెళుతుంది. ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అయితే, టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా ఈ టన్నెల్ను తయారు చేసినట్లు ఎన్టీపీసీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఇక్కడ ఎలాంటి పేలుడు జరగలేదని తెలిపింది. ప్రస్తుతం ఈ సొరంగం నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని సమాచారం. ఇప్పుడు ఈ సొరంగంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, ఎలాంటి బ్లాస్టింగ్ జరగలేదని, ఢిల్లీ మెట్రో తరహాలో ఇక్కడ పనులు జరిగాయని ఎన్టీపీసీ తెలిపింది.
600 కుటుంబాలు తరలిపోతున్నాయి..
జోషిమఠ్ స్థానిక ప్రజల్లో గతంలో కంటే భయాందోళనలు పెరిగాయి. జనవరి 6న ఇక్కడ సింఘ్ధార్ వార్డులో మా భగవతి ఆలయం కూడా కూలిపోయింది. జోషిమత్లోని అత్యంత సున్నితమైన (డేంజర్ జోన్) ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు కూడా ఇచ్చారు. జోషిమత్లో ప్రమాదంలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరారు. ఆయన అక్కడ పర్యటించి పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే, పగుళ్లపై అధ్యయనానికి ఒక పరిశోధకుల బృందాన్ని ఏర్పాటు ఏర్పాటు చేశారు.