
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో కోవిడ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, కాబట్టి రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కోరారు. పౌరుల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
మేం సరఫరా చేయలేం.. మీరే కొనుక్కోండి : కరోనా వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం
ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
కాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 28,303గా ఉంది. కరోనా కారణంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. ఇందులో మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్ లో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.02 శాతంగా నమోదైంది.