
మధ్యప్రదేశ్ లో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని, అలాంటి ప్రతిపాదన ఏమీ హోం శాఖ ముందు లేదని ఆ రాష్ట్ర హోం మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ (lock down) విధిస్తారని వార్తలు వస్తుండంటంతో ఆయన స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే ఇప్పుడు విధిస్తున్న జరిమానాను ఇంకా పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. ముఖానికి మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.
పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసు: రాఘవ అరెస్ట్, స్వయంగా పోలీసులకు అప్పగించిన ఎమ్మెల్యే వనమా
కోవిడ్ (COVID) ప్రోటోకాల్ పాటించాలి- వైద్య, విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్
మధ్యప్రదేశ్లో ప్రతీ ఒక్కరూ కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వైద్య, విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ అన్నారు. గడిచిన 24 గంటల్లో 1,033 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించకపోతే రూ.200 జరిమానా విధిస్తామని తెలిపారు. “గత 24 గంటల్లో 594 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,544 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రజలు కోవిడ్ (COVID ) ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండాలని కోరుతున్నాం. ‘రోకో టోకో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించని వారిపై రూ.200 జరిమానా విధించాలని నిర్ణయించాం. ఇతర జిల్లాల్లో కూడా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూసుకుంటున్నాం” అని ఆయన అన్నారు.
మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ప్రైవేటుతో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చామని అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా చేపడుతున్నామని తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న కరోనా కేసులను, ప్రస్తుత పరిస్థితిని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారని అన్నారు. ఇదిలా ఉండగా కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరిన్ని ఆంక్షలు విధించింది. వివాహాలకు హాజరయ్యే వారి సంఖ్య 250కి పరిమితం చేసింది. అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యను 50కి పరిమితం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సీఎం సమీక్షించిన తరవాత ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వుల జారీ చేసింది.
పెరుగుతున్న ఆంక్షలు..
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం ఆంక్షలు విధిస్తున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 50వేలకు పైగా కొత్త కేసులు (Coronavirus) నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో లాక్ డౌన్ కాకుండా కఠినంగా ఆంక్షలు విధించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్నాటక, చత్తీస్ ఘడ్, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూని అమలు చేశాయి. ఢిల్లీ, ముంబై నగరాలు వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ జాబితాలో మరిన్ని రాష్ట్రాలు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.