తోపుడు బండిపై గర్భిణీ భార్య, కూతురు: హైదరాబాద్ నుండి 700 కిలోమీటర్లు లాక్కెళ్లిన భర్త!

By Sree sFirst Published May 14, 2020, 10:28 AM IST
Highlights

హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని సొంతూరు బాలఘాట్ కు గర్భిణీ భార్య, కూతురితో బయల్దేరి నిన్న చేరుకున్నాడు ఒక వలస కార్మికుడు. అన్ని కష్టనష్టాలకోర్చి 700 కిలోమీటర్లను తన భార్యను, కూతురిని ఒక చిన్న చక్రాలతో సొంతగా తయారు చేసిన తోపుబు బండిపై లాక్కుంటూ చేరుకున్నాడు. 

కరోనా వైరస్ లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఉపాధి కోసం వచ్చి ఎక్కడో చిక్కుబడిపోయి తినడానికి తిండి లేక, చేతిలో చిల్లి గవ్వ లేక సొంతూళ్లకు వేల కిలోమీటర్లు పయనమవుతున్న దృశ్యాలను మనం రోజు టీవీల్లో చూస్తూనే ఉన్నాం. 

ఇలానే హైదరాబాద్ నుండి మధ్యప్రదేశ్ లోని సొంతూరు బాలఘాట్ కు గర్భిణీ భార్య, కూతురితో బయల్దేరి నిన్న చేరుకున్నాడు ఒక వలస కార్మికుడు. అన్ని కష్టనష్టాలకోర్చి 700 కిలోమీటర్లను తన భార్యను, కూతురిని ఒక చిన్న చక్రాలతో సొంతగా తయారు చేసిన తోపుబు బండిపై లాక్కుంటూ చేరుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే... రాము అనే ఒక వలస కార్మికుడు గర్భవతి అయిన భార్య ధన్వంత, కూతురు అనురాగిణితో కలిసి మధ్యప్రదేశ్ లోని తన సొంత ఊరికి చేరుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఎటువంటి రవాణా సదుపాయం లేకపోవడంతో కాలినడకన తన ప్రయాణాన్ని ఆరంభించాడు. 

హైదరాబాద్ టు మధ్యప్రదేశ్: 700 కిలోమీటర్లను భార్యను, కూతురిని లాక్కెళ్లిన భర్త pic.twitter.com/JIvuUqMFp3

— Asianet News Telugu (@asianet_telugu)

కూతురిని భుజాన ఎత్తుకొని తన భార్యతో కలిసి నడవడం ఆరంభించాడు. కానీ ఇలా ఎక్కువసేపు తన గర్భవతిగా ఉన్న భార్యను నడిపించడం ప్రమాదం అని భావించిన రాము, మార్గమధ్యంలో అడవుల్లో దొరికిన కర్రలతో ఒక తోపుడు బండి లాంటిదాన్ని తయారు చేసాడు. 

అలా తయారుచేసిన చిన్న చక్రాల బండి పై భార్యను, కూతురిని కూర్చోబెట్టి దాదాపుగా 640 కిలోమీటర్లు ఇలా లాక్కుంటూ వెళ్ళాడు. అలా తెలంగాణ, మహారాష్ట్రలను దాటుకొంటూ మధ్యప్రదేశ్ లోని తన సొంత జిల్లాకు చేరుకోగానే... అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వీరిని చూసి చలించి పోయాడు. వారికి మంచి నీరు, బిస్కెట్లను ఇచ్చి ఆ చిన్నారికి కొత్త చెప్పుల జతను కొనిచ్చాడు. 

అక్కడి నుండి ఆ పోలీసు అధికారి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి వారి సొంతూరు వరకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి పంపించాడు. వారు ఇప్పుడు వారి ఊరిలోని ఇంట్లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. 

తిండి లేకుండా రోజులపాటు కూతురిని, భార్యను ఇలా లాకుంటూ ఊరికి తీసుకొచ్చిన రామును చూసి ఊర్లోని వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఆత్మీయంగా స్వాగతం పలికి ఇంట్లో వారికి కావలిసిన ఆహార ఏర్పాట్లను చేసారు. 

click me!