40శాతం టికెట్లు మహిళలకే.. ఉన్నావ్ బాధితురాలి కోసం నిర్ణయం.. ప్రియాంక గాంధీ సంచలన ప్రకటన

By telugu teamFirst Published Oct 19, 2021, 2:31 PM IST
Highlights

ప్రియాంక గాంధీ వాద్రా సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ 40శాతం టికెట్లు ఇస్తుందని ప్రకటించారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వారి నియోజకవర్గం కోసం చేసిన కృషి ఆధారంగా మహిళా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. దేశంలో విద్వేషం రగులుతున్నదని, దీన్ని మహిళలు మాత్రమే పరిష్కరించగలరని తెలిపారు. ఉన్నావ్, హత్రాస్, ఇతర ఘటనల్లో మహిళా బాధితుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 

లక్నో: Uttar Pradesh అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొంతకాలంగా ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఈ ఎన్నికలను ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా సారథ్యంలో కాంగ్రెస్ ఎదుర్కోనుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం Priyanka Gandhiకి విశేష ఆదరణ ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోసం ఆమె తరుచూ ఉత్తరప్రదేశ్ పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులను కలిసి Assembly Elections సన్నద్ధతను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే ఆమె ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు పూర్తిస్థాయిలో షిఫ్ట్ కాబోతున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆమె లక్నోకు వెళ్లనున్నారు.

ఈ రోజు ఆమె ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. లక్నోలో కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్‌లో ఆమె సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు కాంగ్రెస్ 40శాతం టికెట్లు ఇస్తుందని తెలిపారు. కొన్ని పార్టీలు వారికి ఎల్పీజీ కనెక్షన్ ఇస్తేనో, రూ. 2000 ఇస్తేనో సరిపోతుందని, వాటి ద్వారా womenను ప్రలోభించవచ్చని భావిస్తున్నాయని పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు.

దేశంలో తీవ్ర విద్వేషం రగులుతున్నదని, దాన్ని కేవలం మహిళలమే తుదముట్టించగలమని ప్రియాంక గాంధీ అన్నారు. మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తనతో భుజం భుజం కలిపి ముందుకు నడవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే మహిళలు వచ్చే నెల 15వ తేదీ లోపు తమను సంప్రదించాలని అన్నారు. ఆ మహిళలు వారి నియోజకవర్గం కోసం చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని, మెరిట్ ఆధారంగా tickets పంపిణీ చేస్తామని తెలిపారు.

Also Read: మోడీగారు.. మీరు లఖీంపూర్ వెళ్ళగలరా?.. ప్రధానికి ప్రియాంకా గాంధీ సూటిప్రశ్న..

ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణాలున్నాయని ప్రియాంక తెలిపారు. ఉన్నావ్‌కు చెందిన లైంగికదాడి బాధితురాలు.. ఇంకా న్యాయం పొందలేదని, ఆమె కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంతేకాదు, హత్రాస్ బాధితురాలి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రధానమంత్రి కావాలని కలలు గంటున్న లఖింపూర్‌ ఖేరికి చెందిన బాలిక కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్వేగంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ను పురోగతి పథంలో తీసుకెళ్లాలనుకుంటున్న ప్రతి మహిళ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సీతాపూర్‌లోని పీఏసీ గెస్ట్ హౌజ్ వరకు తన చుట్టూ చేరి సురక్షితంగా తీసుకెళ్లిన మహిళా పోలీసు అధికారుల కోసం ఈ నిర్ణయమని చెప్పారు.

దేశం మత రాజకీయాల నుంచి బయటపడాల్సి ఉన్నదని ప్రియాంక అన్నారు. మహిళలు స్వతంత్రంగా రాజకీయాలు చేయాలని కోరారు. ఇది ఆరంభం మాత్రమేనని, అందుకే మహిళలకు 40శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలోనే దీన్ని 50శాతానికి పెంచుతామని చెప్పారు.

ఉన్నావ్, హత్రాస్ ఘటనలు బీజేపీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఉన్నావ్ కేసులో ఓ బీజేపీ ఎమ్మెల్యేనే ప్రధాన నిందితుడు. తనకు న్యాయం జరగడం లేదని బాధితురాలు ఏకంగా సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్రాస్ ఘటనలో బాధితురాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించకుండా రాత్రికి రాత్రే దహనం చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

click me!