
సహచర ఉద్యోగినిపై లైంగిక వేధింపుల పాల్పడిన కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ ఉద్యోగిని డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడు అరెస్టయిన కొద్దిసేపటికే బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్లో పనిచేసే ఓ 28 ఏళ్ల యువతి తాను లైంగిక వేధింపులకు గురయ్యానంటూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పార్టీ సోషల్ మీడియా ఛైర్పర్సన్ దివ్య స్పందన, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పార్టీలో కలకలం రేగిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వింగ్ ఛైర్పర్సన్ దివ్య స్పందన వద్ద సహాయకుడిగా పనిచేసే చిరాగ్ పట్నాయక్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు జూన్ 11న ఈ ఫిర్యాదు చేసింది. తాను పనిలో నిమగ్నమై ఉండగా.. పట్నాయక్ ఏదో ట్వీట్లు చేయడానికని పదేపదే తన వద్దకు ఉద్దేశ్యపూర్వంగా వచ్చేవాడని.. అలా నాకు అతి దగ్గరగా జరుగుతూ.. ట్వీట్టర్ ఖాతాను తనిఖీ చేస్తున్నట్లు నటించేవాడని తెలిపింది. అప్పుడే అతని ఉద్దేశ్యం ఏంటో తనకు అర్థమైందని వివరించింది. రోజు రోజుకు అతని వేధింపులు ఎక్కువయ్యాయని.. తర్వాతి రోజు నుంచి పదే పదే తన చేతిపైన, భుజం పైన తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పేర్కొంది. అతనికి తనకు దూరం కేవలం 1.2 మీటర్లేనని చిరాగ్ తన కాలిని తన కాలితో నిమిరేవాడని... తన శరీర భాగాల వంక తదేకంగా చూస్తూ మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని.. అందువల్ల ఆ వాతావరణంలో పనిచేయలేకపోతున్నట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి చిరాగ్ పట్నాయక్ ను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వెంటనే చీరాగ్ బెయిల్ పై విడుదలయ్యాడు.
ఈ వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలోని కొందరు అధికారులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా వింగ్ ఛైర్పర్సన్ దివ్య స్పందన తెలిపారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఈ కమీటీ దర్యాప్తు జరుపుతోందని, నిజానిజాలు త్వరలో వెల్లడవుతాయని ఆమె మీడియాకు వివరించారు.