చిదంబరం కంట కన్నీరు.. అక్మడ ఉండడం వల్లే శరీరం గట్టిపడిందంటూ..

By sivanagaprasad KodatiFirst Published Dec 5, 2019, 3:42 PM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బుధవారం రాత్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బుధవారం రాత్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన... పార్లమెంట్ భవనం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని, పార్టీ కార్యాలయానికి వెళ్లి మీడియాతో మాట్లాడారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని... మంత్రిగా ఉన్న సమయంలో తాను ఏం చేశాననో అందరికీ తెలుసునని చిదంబరం గుర్తుచేశారు. తనతో పని చేసిన అధికారులు, తనను గమనించిన జర్నలిస్టులకు ఈ సంగతి బాగా తెలుసునన్నారు.

Also Read:ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు బెయిల్, 106 రోజుల తర్వాత బయటికి

దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం కుప్పకూల్చింది.. ఆర్ధిక పరిస్ధితిపై ప్రధాని ఏనాడూ మాట్లాడలేదని చిదంబరం ఎద్దేవా చేశారు. ఉల్లిధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని.. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కవచ్చునని, అయినప్పటికీ ప్రభుత్వం అసమర్ధంగా వ్యవహరిస్తోందని చిదంబరం ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆర్దిక నిర్ణయాలు తిరోగమనంలో ఉన్నాయని... ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

తీహార్ జైలులో జీవితం గురించి మాట్లాడుతూ చిదంబరం భావోద్వేగానికి గురయ్యారు. 100 రోజులకకు పైగా తీహార్ జైలులో గడపటం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు శరీరం కూడా చాలా గట్టిపడిందని చిదంబరం స్పష్టం చేశారు.

Also Read:చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

జైలులో ఉన్నన్నాళ్లు చెక్కబల్లపై నిద్రించడంతో మెడ, వెన్నెముక, తల మరింత దృఢపడ్డాయని ఆయన తెలిపారు. 106 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువును పీలుస్తున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

click me!