టార్గెట్ 2024: పీఎం మోడీ, యూపీ సీఎం యోగి ఇలాకాలో ప్రియాంక గాంధీ హల్‌చల్.. అందుకోసమేనా?

By telugu teamFirst Published Oct 31, 2021, 8:36 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ప్రియాంక గాంధీ సారథ్యంలో రాష్ట్రంలో ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలకూ భూమికను సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అందుకే అటు సీఎం, ఇటు పీఎం ఇలాకాలో ప్రియాంక గాంధీ హల్ చల్ చేస్తున్నారు.
 

లక్నో: Uttar Pradesh అసెంబ్లీ కోసం Congress తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ రాష్ట్రంలో గత Assembly Electionsలో పార్టీ దాదాపు తుడిచిపెట్టేసుకుపోయింది. 403 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం ఏడు సీట్లనే కాంగ్రెస్ గెలుచుకుంది. అదీగాక, వచ్చే General Electionsలో బలమైన పోటీ ఇవ్వాలంటే దానికంటే ముందు జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని యోచిస్తున్నది. దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌నే కావడం గమనార్హం. అందుకే కాంగ్రెస్ ఇప్పటి నుంచే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీని టార్గెట్ చేస్తున్నది.

ఉత్తరప్రదేశ్‌లో 80 పార్లమెంటు స్థానాలున్నాయి. రెండు సార్లు కేంద్రంలో BJP అధికారంలోకి రావడానికి ఉత్తరప్రదేశ్ కీలకంగా ఉన్నది. ఎందుకంటే ఎన్‌డీయే కూటమి 71 స్థానాలు, 62 స్థానాలను కైవసం చేసుకుని మెరుగైన నెంబర్లను స్వాధీనం చేసుకుంది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం రెండు, ఒక్క స్థానానికే పరిమితమైంది. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఉత్తరప్రదేశ్ కీలకాస్త్రం. 

అదీగాక, రెండు సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైట్ వింగ్‌లో బలమైన నేతలుగా కనిపించే నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యానాథ్‌లు ఇక్కడ నుంచి గెలిచే పాలిస్తున్నారు. అదీగాక, బీజేపీ తొలి నుంచీ బలపడటానికి కారణమైన అయోధ్య రామ మందిరానికీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కీలకమైంది. అందుకే కాంగ్రెస్ ఈ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో, తాజాగా, సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్‌లో పర్యటనలు చేసి బీజేపీపై విమర్శలు కురిపించారు. అంతేకాదు, పలు హామీలను ఇచ్చారు.

Also Read: మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీనే.. యూపీ సీఎం అభ్యర్థి ఆయనే.. : కేంద్ర హోం మంత్రి

ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యేక బాధ్యతలు తీసుకున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమెనే సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్నారు. లఖింపూర్ ఖేరి ఘటన సమయంలోనూ ఆమె చాలా చురుకుగా ఉన్నారు. ఆ ఘటనతో బీజేపీని కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టగలిగినా, కాంగ్రెస్ ఎంత లబ్ది చేకూర్చుకుందనేది చెప్పలేని పరిస్థితి.

ప్రియాంక గాంధీ ఆదివారం గోరఖ్‌పూర్‌లో పర్యటించారు. గురు గోరఖ్‌నాథ్ బోధనలకు విరుద్ధంగా పరిస్థితులు మారుతున్నాయని పరోక్షంగా యోగి ఆదిత్యానాథ్‌పై విమర్శలు చేశారు. ఇక్కడ గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా యోగి ఆదిత్యానాథ్ కొనసాగుతుండటం గమనార్హం.

Also Read: వారణాసి పర్యటనలో ప్రధాని.. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రారంభించిన మోడీ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తే రైతులకు ఉన్న మొత్తం సాగు రుణాలను మాఫీ చేస్తామని, గోధులు, వడ్ల ధరను క్వింటాల్‌కు రూ. 2,500కు పెంచుతామని ప్రియాంక గాంధీ వాద్రా హామీనిచ్చారు. చెరుకును క్వింటాల్‌కు రూ. 400 చెల్లిస్తామని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 10వేల గౌరవవేతనం అందిస్తామని, మహిళలకు ఏడాదిలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని చెప్పారు. రూ. 10 లక్షల వరకు ప్రతి అనారోగ్య సమస్యకు ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25వేలు అందిస్తామని తెలిపారు.

click me!