
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టాప్ లీడర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాజీనామాలపై దుమారం రేగింది. వారు రేపు రాజీనామా చేస్తున్నారనే వార్తలు.. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పార్టీల్లోనూ కలకలం రేపింది. ఈ వార్తలు నిజమేనా? కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి ఏమని స్పందించారు? వంటి విషయాలు పరిశీలిద్దాం.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక బాడీ సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ) సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలూ రాజీనామా చేయనున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. ఈ ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ ముగ్గురు టాప్ లీడర్లు తమ రాజీనామాలను సమర్పిస్తున్నారనేది ఆ కథనం సారాంశం.
ఈ కథనం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. ఆ వార్త కథనం అవాస్తవం అని స్పష్టం చేసింది. ఆ వార్తలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందించారు. పేర్లు తెలుపని కొన్ని వర్గాల పేరిట ఎన్డీటీవీ అనే వార్తా సంస్థ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రేపు రాజీనామాలు చేస్తారని ఓ కథనాన్ని వండివార్చిందని విమర్శించారు. ఇది అవాస్తవం అని, తప్పుదారి పట్టించే కథనం అని కొట్టిపారేశారు. అధికార బీజేపీ ఒత్తిళ్లతో కొన్ని వర్గాలు చేస్తున్న దుష్ప్రచారంలో ఒక టీవీ చానెల్ భాగమై అది కూడా దుష్ప్రచారానికి పూనుకోవడం దారుణం అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, రేపు నిర్వహించే సీడబ్ల్యూసీ సమావేశంలో శాశ్వత సభ్యులతోపాటు ప్రత్యేక ఆహ్వానితులు సహా మొత్తం సుమారు 56 మంది నేతలు భేటీ కాబోతున్నారు.
కాగా, కాంగ్రెస్ టాప్ లీడర్లు గతంలో రాజీనామాలు ప్రకటించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు రాజీనామా చేసినా సభ్యులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు. సోనియా గాంధీ కూడా రాజీనామా ప్రకటించగా సీడబ్ల్యూసీ సభ్యులు తిరస్కరించారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజం లేదని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రేపు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో రాజీనామాలు సమర్పిస్తారని వస్తున్న వార్తలు అవాస్తవాలని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఐదు రాష్ట్రాల్లో ఒక్కదాంట్లోనూ మెజార్టీ సీట్లు సాధించలేదు. సరికదా పంజాబ్ రాష్ట్రాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పింది. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేక చతికిల పడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై అసమ్మతిదారులు కత్తులు నూరుతున్నట్టు వార్తలు వచ్చాయి. సమూల మార్పులు తీసుకురావల్సిందేనని, నాయకత్వానికి ఎన్నికలు నిర్వహించాలని, ఇంకా మరెన్నో ప్రతిపాదనలను వారు ముందుకు తెస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.